బియాస్ తరహా దుర్ఘటన: రెండు కుటుంబాలు...
posted on Aug 5, 2014 4:59PM
హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నదిలో వరద నీటి ప్రవాహం పెరగడం వల్ల హైదరాబాద్కి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయిన దుర్ఘటనను మరవకముందే సరిగ్గా అలాంటి దుర్ఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. మధ్యప్రదేశ్లోని హన్మాన్తల్ ప్రాంతానికి చెందిన రెండు కుటుంబాలకు చెందిన 12 మంది బాగ్దారి జలపాతానికి వెళ్లారు. కొండల మధ్య చిన్న నదీపాయను దాటి పిక్నిక్ స్పాట్కు చేరుకున్నారు. సరిగ్గా వాళ్లు తిరిగి ఇంటికి వెళ్దామనుకుంటున్న సమయంలో అనూహ్యంగా పెరిగిపోయిన వరద ఆ రెండు కుటుంబాలను కబళించేసింది. వరద ఉద్ధృతిలో మొదట ఓ యువకుడు పడిపోగా అతడిని రక్షించే ప్రయత్నంలో మిగతా వారంతా కొట్టుకుపోయారు. ఒక యువతి మాత్రం ప్రాణాలతో బయటపడగలిగింది. సహాయ బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టాయి. ఈ గాలింపులో ఇప్పటి వరకు 8 మృతదేహాలను వెలికి తీశారు. మరో ముగ్గురి కోసం గాలింపు జరుగుతోంది.