భారీ పేలుడు.. పుల్వామా సూత్రధారికి తీవ్ర గాయాలు!

 

పాకిస్థాన్‌లోని రావల్పిండి మిలిటరీ ఆసుపత్రిలో భారీ పేలుడు సంభవించిందంటూ సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. రావల్పిండికి చెందిన మానవ హక్కుల కార్యకర్త అసానుల్లా అనే వ్యక్తి దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేశాడు. అక్కడి మిలిటరీ ఆసుపత్రిలో జరిగిన పేలుళ్లలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయని, అందులో జైషే మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ కూడా ఉన్నాడనేది ఈ ట్వీట్‌ సారాంశం. పేలుడు ఘటనలో గాయపడిన వారిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించినట్లు ఆయన తెలిపారు. ఘటనాస్థలం వద్దకు వెళ్లడానికి మీడియాకు అనుమతి ఇవ్వలేదన్నారు. అసానుల్లాతో పాటు మరికొందరు నెటిజన్లు కూడా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆసుప్రతిలో జరిగింది ప్రమాదం కాదని, ప్రణాళికా బద్ధంగా జరిగిన దాడేనని కొందరు అంటున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కాగా 40 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న పుల్వామా దాడి వెనుక జైషే మహమ్మద్‌ ఉన్న సంగతి తెలిసిందే.