వైసీపీలోకి వలసలు... తాజాగా మరో నేత..
posted on Jan 24, 2017 1:47PM
ఒక పక్క వైసీపీ నేతలు అధికార పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అవుతుంటే..మరోపక్క కాంగ్రెస్ నుండి నేతలు వైసీపీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి, దివంగత నేత కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీధర్ కూడా వైఎస్సార్సీపీలో చేరనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 29న పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పార్టీలో చేరబోతున్నారు. ఇప్పుడు తాజాగా చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు విజయభాస్కర్రెడ్డి మంగళవారం వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన ఈరోజు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తానని చెప్పారు.