మాది సమైఖ్యవాదమే : విజయమ్మ
posted on Sep 12, 2013 7:48AM
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వెంటనే ఆపేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షులు వైయస్ విజయమ్మ కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండేకు లేఖ రాశారు. సిపియం మినహా అన్ని పార్టీలు విభజనకు అనుకూలంగా ఉన్నాయన్న షిండే వ్యాఖ్యలను ఆమె ఖండిచారు. సిపియంతో పాటు మజ్లిస్, వైయస్ఆర్సిపిలు కూడా విభజనకు వ్యతిరేఖమన్నారు.
గత ఏడాది డిసెంబర్లో జరిగిన అఖిలపక్షంతో పాటు, ప్రదానికి రాసిన లేఖలో కూడా తాము సమైఖ్య గళమే వినిపించామన్నారు విజయమ్మ. విభజన నిర్ణయం వల్ల సీమాంద్ర ప్రాంతం తగలబడుతుందని కేంద్ర చొరవ తీసుకొని పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు.
ఏకాభిప్రాయం కుదరక కుండా విభజనపై ముందుకెలా వెళ్తారని ప్రశ్నించిన ఆమె, రాష్ట్రం కలిసున్నపుడే కర్నాటక, మహారాష్ట్రలతో నీటి సమస్యలు ఉన్నాయని విభజన తరువాత సమస్యలు మరింత తీవ్రమవుతాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయంలో 50 శాతం హైదరాబాద్ నుంచే లభిస్తున్నదని, విడిపోతే ఉద్యోగాల కోసం సీమాంధ్రులు ఎక్కడికి వెళ్ళాలని ఆమె ప్రశ్నించారు.