వైఎస్ షర్మిలాకు ఆపరేషన్ జరగలేదు!
posted on Feb 5, 2013 11:55AM
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలా మోకాలికి గాయం కావడంతో కీహోల్ ఆపరేషన్ చేశారు. దీంతో యాత్రకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే షర్మిలా మోకాలికి ఆపరేషన్ జరగలేదని కవిత అనుమాన౦ వ్యక్తం చేశారు. ఆపరేషన్ నిజమే అయితే అందుకు సంబంధించిన వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
షర్మిల ప్రభుత్వ సహకారంతో పోలీసుల అండతో పాదయాత్ర చేస్తున్నారని, తెలంగాణ ప్రజలను అది అవమానించడమేనని తెలంగాణ జాగృతి అద్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణపై స్పష్టత ఇచ్చిన తర్వాతనే షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే తాము నల్ల జెండాలతో ఆమె మరో ప్రజా ప్రస్థానం యాత్రకు నిరసన తెలియజేస్తామన్నారు.
జగన్ అధికారంలోకి వస్తే వైయస్ కుటుంబానికే వెలుగు కానీ, తెలంగాణ ప్రజలకు తెలంగాణ వస్తేనే వెలుగు వస్తుందని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణలోని నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను షర్మిల గౌరవించాలని ఆమె సూచించారు. ఇప్పటి వరకు జగన్ పార్టీ తెలంగాణపై స్పష్టత ఇవ్వక పోవడం శోచనీయం అన్నారు. బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల అవినీతి పై చట్టం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నానని చెప్పారు.