TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోడ్డుపై వైసీపీ క్యాడర్.. బెంగళూరులో లీడర్

Published on: Wed Jun 4, 2025 9:08PM

 

జగన్ పార్టీ పరాజయం పాలై సరిగ్గా ఏడాది పూర్తైంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ సీఎం జగన్ వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి రావడం మానేశారు. పోనీ ప్రజాసమస్యలపై పోరాటాలకు ప్రజల్లోకి వస్తున్నారా అంటే అదీ లేదు. తాడేపల్లి ఓటమి తర్వాత పార్టీ నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న జగన్ జైళ్లలో పరామర్శలు, లేకపోతే ఎక్కడెక్కడో దాడులు జరిగాయంటూ ఓదార్పులతో ఏడాది కాలం వెల్లబుచ్చడం విమర్శల పాలవుతోంది. ఆఖరికి పార్టీపరంగా 

పిలుపునిచ్చిన ఆందోళనల్లో కూడా ఆయన పాల్గొనకపోవడంపై సొంత పార్టీల్లోనే అసంతృప్తులు వక్తమవున్నాయి.జూన్ 4 సరిగ్గా ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తైంది . కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత రాష్ట్రానికి మహర్దశ పట్టిందని, రాష్ట్రానికి పట్టిన విరగడైందని మిత్రపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 4న వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నాం. ప్రతీ ఒక్కరూ ఈ నిరసనల్లో పాల్గొనాలి అని జగన్‌ పిలుపు ఇచ్చారు. అంతలావున  పిలుపు ఇచ్చిన మాజీ  ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో ఎక్కడా కనిపించలేదు.

వైసీపీ శ్రేణులు అక్కడక్కడ ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. కానీ, ఈ కార్యక్రమంలో ముందుండాల్సిన పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఎక్కడ కనిపించలేదు. దీంతో జగన్ ఏమైపోయారు అని పార్టీ నేతలు, కార్యకర్తలు చర్చించుకున్నారు. మంగళవారం తెనాలిలో తమ వారిపై పోలీసులు దాడి చేశారంటూ రౌడీ షీటర్ల కుటుంబాలను పరామర్శించిన జగన్.. అటు నుంచి అటే బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌కు వెళ్లిపోయారు. ఇంకోరోజు రాష్ట్రంలో ఉండి పార్టీ కార్యక్రమంలో పాల్గొనకపోవడం వైసీపీ క్యాడర్ కు ఏమాత్రం రుచించడం లేదంట.వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది. 

అయినా ఈ కార్యక్రమంలో జగనే పాల్గొనకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీని తిరిగి పవర్ లోకి తీసుకొచ్చేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడాలి.. జగన్ మాత్రం ప్యాలెస్ లో కూర్చొని హాయిగా రెస్ట్ తీసుకుంటారా అని రుసరుసలాడుతున్నారు. మరో మూడేళ్లు ఓపిక పట్టండి, తర్వాత మనదే అధికారం అంటూ జగన్ తెగ ధీమాగా చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఇంటింటికి వెళ్లి చెప్పాలని కార్యకర్తలకు చెప్తున్న జగన్..తమ కష్టంతో అధికారంలోకి వద్దామనుకుంటున్నారా?.. అదే అసలైన వెన్నుపోటని వైసీపీ శ్రేణులు గొణుక్కుంటున్నాయి.

వెన్నుపోటు దినంలో పాల్గొనకుండా బెంగళూరు వెళ్లిపోయిన జగన్ నెక్ట్స్ షెడ్యూల్‌ని ఎంపీ మిథున్‌రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి వెళ్లి పరామర్శించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్  ఈ నెల11 లేదా 12న నెల్లూరు జైలుకు వస్తారని చెప్పుకొచ్చారు. 
పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనని జగన్.. జైళ్లలో పరామర్శలు, ఓదార్పులకు మాత్రమే జనంలోకి వస్తుండటంపై సోషల్ మీడియాలో కూడా తెగ సెటైర్లు వినిపిస్తున్నాయి.