TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీమ్ ఇండియా తుది జట్టులోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఎప్పుడంటే..?

Published on: Sat Jul 4, 2026 9:04AM

అంతర్జాతీయ  క్రికెట్ లో  యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెన్స్ టీంలో అరంగేట్రం పై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ తో టి20 సిరీస్ లో తొలి మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీకి చోటు కల్పించకపోవడంపై క్రికెట్ దిగ్గజాలు విమర్శలు గుప్పిస్తున్నారు.   15 ఏళ్ల వయస్సులోనే తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపైనే ఇప్పుడు చర్చ జరుగుతున్నది.  ఐపీఎల్ 2026 సీజన్‌లో అసాధారణ ఆటతీరుతో వెలుగులోకి వచ్చిన ఈ యంగ్ బ్యాటర్ ఇంటర్నేషనల్ ఎంట్రీ కోసం అభిమానులు  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే..  ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై క్రికెట్ దిగ్గజాల విమర్శించడమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు వెల్లువెత్తాయి.   ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లక్ష్యంగా  నెటిజనులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

ఈ నేపథ్యంలోనే బీసీసీఐ  ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు.  ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో..   వైభవ్   అద్భుతమైన ప్రతిభావంతుడైన క్రికెటర్ అన్న ఆయన.. ఆ విషయంలో బీసీసీఐకి ఎలాంటి సందేహాలు లేవన్నారు.  ఇప్పటికే  ఐపీఎల్‌లో  సత్తా  నిరూపించుకున్న వైభవ్ ను టీమ్ ఇండియా తుది జట్టులో ఎప్పుడు దించాలన్న నిర్ణయం   పూర్తిగా జట్టు యాజమాన్యానిదేని స్పష్టం చేశారు.  ఈ విషయంలో కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ల నిర్ణయాలకు బీసీసీఐ  మద్దతు ఇస్తుందన్నారు. మ్యాచ్ పరిస్థితులను బట్టి సరైన సమయం వచ్చినప్పుడు మేనేజ్‌మెంట్ ఖచ్చితంగా వైభవ్‌కు అవకాశం కల్పిస్తుందన్నారు. 

నిజానికి ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కావు. ఈ మెగా టోర్నీలో కేవలం 16 ఇన్నింగ్స్‌లలోనే ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను అతడు  ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దక్కించుకున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ టోర్నీలో అతడు 237.30 అనే భారీ స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టాడు.  వైభవ్ అగ్రెసివ్ బ్యాటింగ్  కారణంగానే సెలక్టర్లు అతడిని జాతీయ జట్టులోకి ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అతడి అరంగేట్రం ఖాయమని అందరూ అనుకున్నప్పటికీ, టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం అనుభవజ్ఞులైన అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌ల ఓపెనింగ్ జోడీకే మొగ్గు చూపింది. అంతకుముందు ఐర్లాండ్ సిరీస్‌లోనూ వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపైనే స్పందించిన రాజీవ్ శుక్లా.. జట్టు కూర్పుకు సంబంధించిన వ్యూహాు పూర్తిగా జట్టు యాజమాన్యానివేనన్నారు. రాజీవ్ శుక్లా ఇచ్చిన క్లారిటీతో వైభవ్ సూర్యవంశి అంతర్జాతీయ అరంగేట్రం కోసం మరి కొంత కాలం వేచి చూడక తప్పదని అవగతమౌతోంది. 

Rajeev Shukla BCCI, Gautam Gambhir, Shreyas Iyer, India vs England T20, Vaibhav Suryavanshi stats