కాశ్మీర్‌పై కవిత వ్యాఖ్యలు: దేశవ్యాప్త దుమారం

 

అఖండ భారతదేశంలో అంతర్భాతమైన కాశ్మీర్ విషయంలో టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన కొన్ని వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దేశంలోని కొన్ని భాగాలు భారత్‌కు చెందినవి కావని, దీన్ని మనం అంగీకరించాలని కవిత కాశ్మీర్‌ను ఉద్దేశిస్తూ ఇటీవల ఓ చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్రానికి పూర్వం జమ్ము-కాశ్మీర్, హైదరాబాద్ ప్రత్యేక దేశాలని, భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కాశ్మీర్, హైదరాబాద్‌లను బలవంతంగా భారతదేశంలో కలిపారని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జమ్ముకాశ్మీర్‌తో పాటు తెలంగాణలో భూచట్టాలు ఒకేలాగా ఉన్నాయని ఇరుప్రాంతాల్లో స్థానికులు తప్ప ప్రాంతేతరులు భూములు కొనడం నిషిద్ధమని ఆమె అన్నారు. జమ్ముకాశ్మీర్‌పై భారతదేశానికి స్పష్టత రావాలని అవసరమైతే భారత్ అంతర్జాతీయ సరిహద్దుల్ని మార్చుకోవాలని అంటూ కాశ్మీర్‌ను భారత్ వదులుకోవాలన్న అర్థంలో కవిత మాట్లాడారు. కవిత చేసిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ సింఘ్వీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలు దేశ సమగ్రతపైనా, సమాఖ్య చట్టబద్ధతపైనా అనుమానాలు రేకెత్తించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని అన్నారు. వాస్తవాలను వక్రీకరించడం కవితకు తగదని హితవు పలికారు. కవిత వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరమని మరో కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ అన్నారు. ఇలాంటి విపరీత వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.