గోడ మీద పిల్లిలా పార్టీలు
posted on Aug 29, 2013 4:46PM
తెలంగాణ ప్రజలు సీమాంధ్ర ఉద్యోగులకు గానీ, హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్రులకు గానీ వ్యతిరేకం కాదు. ప్రపంచంలోనే అత్యంత శాంతియుతంగా ఒక్క రక్తం చుక్క చిందకుండా గత 13 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఏర్పాటుకు అన్ని పార్టీలు మద్దతు తెలిపిన తరవాత, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ప్రకటన వచ్చింది. ఇప్పుడు సీమాంధ్ర నేతలు, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని టీఆర్ఎస్ విమర్శించింది. సీమాంధ్రలో ఉద్యమం నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ మీద నిర్ణయం వచ్చాక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్యాయం అంటోంది. మరి ఇంతకుముందు తెలంగాణలో తిరిగినప్పుడు, దీక్షలు చేసినప్పుడు విజయమ్మ, జగన్, షర్మిలలు ఇలా ఎందుకు అనలేదు ? తెలంగాణ రాకముందు అనుకూలమని చెప్పి, ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు రెండుకళ్ల సిద్దాంతంతో మాట్లాడుతున్నారు. మీకు తెలంగాణ అంటే ఇష్టం లేకుంటే సమైక్యానికి అనుకూలం అని ధైర్యంగా చెప్పండి కానీ గోడ మీద పిల్లిలా వ్యవహరించడం మానుకోవాలని టీఆర్ఎస్ నేతలు మందా జగన్నాధం, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి తదితరులు అన్నారు.