కవిత కాశ్మీర్‌ మీద ఆ కామెంట్స్ చేయకుండా వుండాల్సింది!

 

టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత కాశ్మీర్ విషయంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దేశంలోని కొన్ని భాగాలు భారత్‌కు చెందినవి కావని, దీన్ని మనం అంగీకరించాలని కవిత కాశ్మీర్‌ను ఉద్దేశిస్తూ ఇటీవల ఓ చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్రానికి పూర్వం జమ్ము-కాశ్మీర్, హైదరాబాద్ ప్రత్యేక దేశాలని, భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కాశ్మీర్, హైదరాబాద్‌లను బలవంతంగా భారతదేశంలో కలిపారని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జమ్ముకాశ్మీర్‌తో పాటు తెలంగాణలో భూచట్టాలు ఒకేలాగా ఉన్నాయని ఇరుప్రాంతాల్లో స్థానికులు తప్ప ప్రాంతేతరులు భూములు కొనడం నిషిద్ధమని ఆమె అన్నారు. జమ్ముకాశ్మీర్‌పై భారతదేశానికి స్పష్టత రావాలని అవసరమైతే భారత్ అంతర్జాతీయ సరిహద్దుల్ని మార్చుకోవాలని అంటూ కాశ్మీర్‌ను భారత్ వదులుకోవాలన్న అర్థంలో కవిత మాట్లాడారు. ఈ వ్యాఖ్యల మీద దేశవ్యాప్తంగా ఎంతో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కవిత చేసిన వ్యాఖ్యలు దేశ సమగ్రతపైనా, సమాఖ్య చట్టబద్ధతపైనా అనుమానాలు రేకెత్తించే విధంగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా వుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు టీఆర్ఎస్ నేతల్లో అంతర్గతంగా వ్యక్తమవుతున్నాయి. కవిత తన దూకుడుతో కూడిన మాటలను సీమాంధ్రుల మీద ప్రయోగిస్తే పర్లేదుగానీ, దేశ సమగ్రత మీద ప్రయోగించడం లేనిపోని ఇబ్బందులను సృష్టించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.