TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్.. రెండో వన్డేలో టీమ్ ఇండియా ఓటమి.!

Published on: Fri Jul 17, 2026 10:17AM

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య  మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో రెండో వన్డేలో టీమ్ ఇండియా పరాజయం పాలైంది.  కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో   ఇంగ్లండ్  టీమిండియాపై 4 వికెట్ల తేడాతో  విజయం సాధించింది. తొలి వన్డేలో టీమ్ ఇండియా సునాయాస విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో వన్డేలో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో   మూడు వన్డేల సిరీస్  1-1 తో సమం అయ్యింది. ఇక సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి మూడో వన్డే ఈ లార్డ్స్ వేదికగా ఈ నెల 19న జరగనుంది. 

ఇక రెండో వన్డే విషయానికి వస్తే.. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌట్ అయ్యింది.    విరాట్ కోహ్లీ 65, శ్రేయస్ అయ్యర్ 66 పరుగులతో రాణించడంతో టీమ్ ఇండియా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. వీరిద్దరూ వినా మిగిలిన బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా పెవిలియన్ బాటపట్టారు.  ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్ చెరో 3 వికెట్లు తీయగా, సాకిబ్ మహ్మూద్ 2 వికెట్లు దక్కించుకున్నాడు.

అనంతరం  234 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్   ఆరంభంలోనే  వికెట్లు కోల్పోయింది.  ఒక దశలో 125 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ ను  జో రూట్  అద్భుత ఇన్నింగ్స్ తో ఆదుకున్నాడు.   విల్ జాక్స్‌తో కలిసి 6వ వికెట్‌కు  72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

చివరి వరకు ఒంటరి పోరాటం చేసిన జో రూట్ 133 బంతుల్లో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేవలం ఒక్క పరుగుతో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ, జట్టును విజయతీరాలకు చేర్చి మ్యాచ్ హీరోగా నిలిచాడు.  ఇంగ్లండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్ 2 వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్‌కు తలో వికెట్ దక్కింది.  

virat kohli half century, shreyas iyer 66, india vs england odi series 1-1