టీడీపీ నేత లాల్జాన్ భాషా కన్నుమూత
posted on Aug 15, 2013 12:56PM
టీడీపీ సీనియర్ నేత లాల్జాన్ భాషా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో భాషా అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా నల్గొండ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
1984లో గుంటూరు నుంచి ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా టిడిపి తరఫున ఎన్నికయ్యారు. 1991లో ఆయన ఎన్జి రంగాను ఎన్నికల్లో ఓడించారు. ముంబైలోని ప్రఖ్యాతి గాంచిన మార్కంటైల్ బ్యాంక్ చైర్మన్గా ఆయన పనిచేస్తున్నారు.
బాషా మృతికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. చంద్రబాబు నాయుడు నల్లగొండకు బయలుదేరారు. లాల్ జాన్ బాషా మృతి తనకు వ్యక్తిగతంగా తీరనిలోటు అని ఆయన అన్నారు. పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తలను కోల్పోయిందని అన్నారు.