TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బోగస్ డెత్ సర్టిఫికెట్ తో ల్యాండ్ స్కామ్..మాజీ స్పీకర్ తమ్మినేనికి బిగుస్తున్న ఉచ్చు.!?

Published on: Mon Jul 20, 2026 2:47PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో  భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. శాసనసభ మాజీ స్పీకర్,  వైసీపీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం కుటుంబంపై భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.   శ్రీకాకుళం జిల్లాలో  విలువైన భూమిని నకిలీ పత్రాలతో కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్నఆరోపణలపై తమ్మినేని సీతారాం  కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది.  

బాధితులు, పోలీసు సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం సమీపంలోని చాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న  900 చదరపు గజాల ఖాళీ స్థలం కబ్జాలక్ష్యంగా..  ఆ భూమి అసలు యజమానులకు సంబంధం లేకుండా,   స్థలాన్ని కబ్జా చేసేందుకు, లేని వ్యక్తులను ఉన్నట్లుగా, ఉన్న వారిని మరణించినట్లుగా చూపిస్తూ బోగస్ మరణ ధృవీకరణ పత్రాలు  సృష్టించారు. తద్వారా న్యాయబద్ధమైన వారసుల పత్రాలను ఫోర్జరీ చేసి అక్రమంగా యాజమాన్య హక్కులను పొందడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది. 

సదరు 900 చదరపు గజాల స్థలాన్ని తమ్మినేని సీతారాం కుమారుడి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ ప్రక్రియను చట్టబద్ధంగా మార్చడానికి కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేని ఒక మూడో వ్యక్తిని చట్టబద్ధ వారసుడిగా చూపిస్తూ పత్రాలు సృష్టించారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రభుత్వ అధికారుల కళ్లు గప్పి, లేకుంటే వారితో  కుమ్మక్కై ఈ  దందాను నడిపినట్లు పోలీసులు ప్రాథమికంగా  భావిస్తున్నారు. 

ఈ భూ కుంభకోణం కేసులో ఇప్పటివరకు మొత్తం 13 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన సూత్రధారులు, సహకరించిన వ్యక్తులు కలిపి ఎనిమిది మందిని ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి నకిలీ రబ్బరు స్టాంప్‌లు, ఫోర్జరీ పత్రాలు, ప్రభుత్వ అధికారుల ముద్రలతో ఉన్న పత్రాలు, అలాగే కుట్రకు ఉపయోగించిన పలు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. భూముల రిజిస్ట్రేషన్ల కోసం నకిలీ స్టాంపులు తయారు చేసే ముఠా సైతం ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. 

ఈ కుంభకోణానికి  సంబంధించి   స్థానిక సబ్ రిజిస్ట్రార్ పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ డెత్ సర్టిఫికెట్లు, ఫోర్జరీ వారసత్వ ధృవీకరణ పత్రాలు ఇచ్చినా,  విచారణ లేకుండా సబ్ రిజిస్ట్రార్ దానికి ఎలా ఆమోదం తెలిపారనే దానిపై దర్యాప్తు సాగుతోంది.   మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, రి కుమారుడికి ఈ కుట్రలో ప్రత్యక్షంగా ఏ మేరకు ప్రమేయం ఉందో పరిశీలిస్తున్నట్లు పోలీలు  తెలిపారు. 

Tammineni Sitaram land scam, Srikakulam land irregularities, bogus death certificates, YCP leader Tammineni Sitaram, Sub Registrar office irregularities