రవీందర్ గైక్వాడ్ వివాదంలో ట్విస్ట్..మోడీని అవమానించినందుకే కొట్టారు

 

శివసేన ఎంపీ రవీందర్ గైక్వాడ్ ఎయిర్ ఇండియా ఉద్యోగిపై చెప్పుతో దాడి చేసి పీకల్లోతు వివాదంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. గైక్వాడ్ మోడీని అవమానించినందుకే కొట్టారట. ఇంతకీ ఈ విషయం చెబుతుంది ఎవరోకాదు స్వయంగా ఎంపీ గారి భార్య. ఈ వివాదంపై స్పందించిన రవీంద్ర గైక్వాడ్‌ భార్య ఉష మాట్లాడుతూ... ఓ వ్యక్తిని తన భర్త ఆ విధంగా కొడతారని తాను ఎప్పుడూ వూహించలేదని, మొదటిసారి ఆయనను అలా చూశానని, ఇది ఎయిరిండియా ఉద్యోగి దురుసు ప్రవర్త వల్లే జరిగిందని ఉష చెప్పారు. ఆ ఉద్యోగి ప్రధాని నరేంద్రమోదీని అవమానపరుస్తూ మాట్లాడినందువల్లే గైక్వాడ్‌కు కోపం వచ్చి కొట్టారని తన భర్తను వెనకేసుకొచ్చారు. తన భర్తకు రాజకీయాల్లో మంచి అనుభవం ఉందని అన్నారు. ఘటన జరిగిన రోజు రాత్రి తాను గైక్వాడ్‌కు ఫోన్‌ చేశానని.. తాను ఎంపీనని చెప్పినా కూడా ఎయిరిండియా ఉద్యోగి తనతో చాలా దురుసుగా ప్రవర్తించాడని గైక్వాడ్‌ చెప్పారని ఉష తెలిపారు.