రవీందర్ గైక్వాడ్ ను ఏం చేయాలి.. సందిగ్ధంలో శివసేన..
posted on Mar 25, 2017 10:46AM
ఎయిర్ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టి శివసేన ఎంపీ రవీందర్ గైక్వాడ్ వివాదంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుటికే ఆయన మీద ఎయిర్ ఇండియాతో పాటు పలు విమానయాన సంస్థలు నిషేదం విధించగా.. ఇప్పుడు ఆయనపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని సంధిగ్ధంలో పడిపోయారు పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే. ఎందుకంటే గైక్వాడ్పై చర్యలు తీసుకుంటే శివసైనికులు జీర్ణించుకోలేరు. హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉంది. గైక్వాడ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా, ఎంపీ పదవికి రాజీనామా చేయమని కోరినా శివసైనికులు తట్టుకోలేరని సీనియర్ నేత ఒకరు తెలిపారు. దీంతో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని సందిగ్ధావస్థలో ఠాక్రే పడిపోయారని తెలిపారు. ఒకవేళ ఆయనపై చర్యలు తీసుకోకుండా వదిలేస్తే దేశానికి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా తనకు బిజినెస్ క్లాసులో సీటు ఇవ్వలేదని ఎంపీ రవీందర్ గైక్వాడ్ ఎయిర్ ఇండియా ఉద్యోగిపై చెప్పుతో కొట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను గైక్వాడ్ కూడా అవును కొట్టాను.. 25 సార్లు చెప్పుతో కొట్టాను అని బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేయడంతో వ్యవహారంపై పెద్ద దుమారం రేగింది.