భార్య స్టేజ్ ఎక్కిందని.. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..
posted on Mar 29, 2017 2:10PM
భార్య తన మాట వినలేదన్న కోపంతో ఏకంగా ఒంటిమీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ భర్త. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని గుత్తిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గుత్తి పట్టణంలో బజారులో షేక్ బషీర్, సాధిక సంజరీ నివాసముంటున్నారు. షేక్ బషీర్ పట్టణంలోని బీరువాల షాపులో పని చేస్తున్నాడు. భార్య సాధిక సంజరీ పాటలు పాడుతుండేది. అయితే వీరిద్దరూ తరచూ గొడవపడుతుండేవారు. దీంతో గత కొద్ది నెలలుగా సాధిక విడిగా ఉంటోంది. గాయనిగా ఖవ్వాలి చెబుతూ జీవిస్తున్నది. ఈ నేపథ్యంలో గత రాత్రి ఆర్అండ్బీ బంగ్లాలో గుత్తి కోట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఉగాదిని పురష్కరించుకుని సందడి చేద్దాం రండి పేరుతో సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాయని సాధిక సంజరీ వెళ్లింది. భర్త షేక్ బషీర్ కూడా కార్యక్రమానికి వెళ్లారు. అయితే సాధిక సంజరీ స్టేజ్ ఎక్కకూడదని , పాటలు పాడకూడదని భర్త షేక్ బషీర్ ఆర్డర్ వేశాడు. అయితే పాటలు పాడితేనే నాలుగు డబ్బులు వస్తాయని నేను పాటలు పాడి తీరుతానని ఆమె స్టేజ్ ఎక్కింది. అంతే వెంటనే తనతో తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్పందించిన కొంతమంది మంటలు ఆర్పి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.