పంజాబ్ లో చొరబడ్డ పాక్ ఉగ్రవాదులు...


ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఉగ్రవాదులు పంజాబ్ లో చొరబడినట్టు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. వివరాల ప్రకారం... బబ్బర్ ఖల్సా అనే తీవ్రవాద సంస్థకు చెందిన 12 మంది సభ్యులు పాకిస్థాన్ లో ఉగ్రవాద శిక్షణ తీసుకుని పంజాబ్ లోకి చొరబడ్డారని హెచ్చరికలు అందాయి. ఈ నెల 23న పోలీసులు అరెస్ట్ చేసిన అనుమానిత ఉగ్రవాది కమల్ దీప్ సింగ్ ను విచారించిన పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకున్నారని సమాచారం. వీరంతా భారీ ఎత్తున ఆయుధాలు తీసుకుని పంజాబ్ లోకి వచ్చారని, ఎన్నికల వేళ విధ్వంసాలకు దిగడమే వీరి లక్ష్యమని, కాశ్మీర్ ప్రాంతానికి చెందిన కమల్ దీప్ వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో పంజాబ్ వ్యాప్తంగా పోలీసు, భద్రతా బలగాలను అలర్ట్ చేసి, పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.