TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రత్యేక హోదా గొడవతో పవన్ హోదా పెరగనుందా?

Published on: Thu Sep 8, 2016 11:57AM

కాశీకి పోయి... అదేదో తెచ్చారంటారు! అలా జరిగింది నిన్నటి జైట్లీ అర్థ రాత్రి ప్రెస్ మీట్! రాష్ట్ర విభజన చేస్తామని చిదంబరం 2009లో చేసిన ప్రకటనని తలపించేలా పరిణామాలు సాగాయి పొద్దంతా! కాని, ఫైనల్ గా జైట్లీ తన అపార అనుభవం ఉపయోగించి ఎక్కడా దేనికీ సీరియస్ గా కమిట్ కాకుండా మీటింగ్ ముగించాడు. ఇటు మీడియాతో సహా మేధావులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తెల్లారితే ఏముంది? ధర్నాలు, రాస్తారోకోలతో రాష్ట్రం దద్దరిల్లిపోయింది! 

ప్రత్యేక హోదా కుదరనే కుదరదు. ప్రత్యేక ప్యాకేజ్ మాత్రం ఇస్తాం. అదీ ఎలాంటి టైం బౌండ్ వుండదని కేంద్రం తేల్చాక అన్ని పార్టీల స్పందనా ఊహించినట్టుగానే వచ్చింది. టీడీపీ ఎన్డీఏలో మిత్రపక్షం కాబట్టి... వచ్చింది బావుంది, ఇంకా రావాల్సి వుంది అనేసింది! వైసీపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ హోదా ఇవ్వకుండా దగా చేశారంటూ అల్లరి మొదలుపెట్టాయి. బంద్ ప్రకటన దాకా వెళ్లిపోయాయి. అయితే, ఇప్పుడు అందరి దృష్టి ఆటోమేటిక్ గా ఒక్కరిపైకి వెళ్లిపోయి ఆగిపోయాయి! అతనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్!

తిరుపతిలో సభ పెట్టి హోదా ఇవ్వాల్సిందేనని పవన్ తెగేసి చెప్పాడు. అంతే కాదు, కాకినాడలో మరోసారి కదం తొక్కుతానని అన్నాడు. ఆ వెంటనే ఢి్ల్లీలో హడావిడి చేసిన కేంద్రం పెద్దలు, టీడీపీ నేతలు బలంగా ఏం సంకేతం ఇవ్వలేకపోయారు. పైగా హోదా కుదరదన్న సంకేతం మాత్రం గట్టిగా ఇచ్చేశారు. ఇప్పుడిక మిగిలింది వీధి పోరాటాలే! అందులోనూ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడన్నదే ఇప్పుడు అందరి ఆలోచన!

రాష్ట్రంలో ప్యాకేజీతో సంతృప్తిగా వున్నది అధికార పక్షం. బీజేపి కూడా టీడీపీ మిత్రపక్షం కాబట్టి వాళ్లూ హ్యాపీనే. ఇక అసలు కీలక పాత్ర వహించాల్సిన ప్రతిపక్షం వైసీపీ. అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీ కాబట్టి హోదా నిరసనల్లో వాళ్లు కీలకం కావాలి. కాని, ఎందుకనో జగన్ సేన జనంలోకి ఫుల్ గా వెళ్లినట్టు కనిపించటం లేదు. కేంద్ర బీజేపిని కూడా వాళ్లు తగినంత టార్గెట్ చేసినట్టు కనిపించటం లేదు. తమ అధినేత పైనున్న కేసుల కారణంగా జగన్ సేన స్లోగా మూవ్ అవుతోందని కొందరి అభిప్రాయం. ఆ సంగతి మనకు తెలియదు కాని ... జగన్ సేన చేయాల్సిన పని ఇప్పుడు జనసేన చేసే ఛాన్స్ వచ్చింది! 

పవన్ చేతిలో ఒక్క ఎమ్మేల్యే కూడా లేకున్నా ప్రతి పక్షం స్థానాన్ని కాకినాడ సభతో ఆక్రమించే గొప్ప అవకాశం ఇప్పుడుంది. కేంద్రాన్ని తిరుపతి సభలోలాగే ఏకిపారేస్తే జనంలో పవనిజం మరింత పెరిగే ఛాన్స్ వుంది. ఇక తరువాత కమ్యూనిస్టుల్లాంటి చిన్నా చితకా పార్టీలు పవన్ వెంట ఎలాగూ వుంటాయి. జంపు జిలానీల సంగతైతే చెప్పేదే లేదు. మరి 2019కి చక్కటి బాట పరుస్తూ ఎదురొచ్చిన ఈ హోదా అవకాశాన్ని పవన్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి...