రాజీనామాలపై పళ్లం రాజు, కోట్ల యూటర్న్!
posted on Oct 6, 2013 9:00PM
కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సీమాంధ్ర నేత పల్లంరాజు తన రాజీనామా విషయంలో వెనక్కి తగ్గారు. అన్ని పార్టీల అభిప్రాయం మేరకే విభజన నిర్ణయం తీసుకున్నామని, రాజీనామాను పక్కనబెట్టి సీమాంధ్ర ప్రయోజనాలు నెరవేర్చేందుకు మంత్రి వర్గ ఉపసంఘంలో ఉండాల్సిందిగా సోనియాగాంధీ సూచించడం తో ఆయన మెత్త బడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇతనితో పాటు మరో కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ని సోనియా సముదాయిండంతో ఆయన కూడా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
సీమాంధ్రలో ఉద్యమం గురించి పల్లం రాజు చెప్పింది విన్న సోనియా ముందు మద్దతు ఇచ్చిన పార్టీలు వెనక్కి తగ్గితే ఏం చేస్తామని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మంత్రుల కమిటీలో పని చేసి సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను తెలియపరచాలని సూచించినట్టు చెబుతున్నారు. సోనియాతో చర్చల నేపథ్యంలో పల్లం రాజు రాజీనామా ఆగిపోయినట్లే. ఇక మరో మంత్రి పనబాక లక్ష్మి రాజీనామా చేసే ముచ్చటే లేదని తెగేసి చెప్పారు. తాను విభజనకు అనుకూలం అని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు.