కృష్ణా జిల్లాలో ఫ్లెక్సీ పాలిట్రిక్స్
posted on Mar 26, 2013 7:41PM
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పాదయాత్ర కృష్ణా జిల్లాకు చేరుకున్న సంధర్బంగా మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లో కోడాలినాని తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టడం సర్వత్రా చర్చ మొదలైంది. కొడాలి నాని జూ.ఎన్టీఆర్ కి స్నేహితుడనే విషయం అందరికీ తెలిసిందే, కానీ ఆయన ఇటీవల తెదేపా వీడి వైకాపాలో చేరిన తరువాత కూడా వారిద్దరి మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని వార్తలు వచ్చాయి. వాటిని ఎన్టీఆర్ ఖండించక పోవడంతో టిడిపి నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు మరింత రాజుకొనేందుకు దోహదపడ్డాయి.
ఇటీవల జూ.ఎన్టీఆర్ విజయవాడ వచ్చినప్పుడు టిడిపి పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీ జెండాలు గానీ చుట్టుపక్కల ఎక్కడా కనబడక పోవడంతో బాలకృష్ణ ఆదేశాల మేరకే ఆవిధంగా జరిగిందని వర్ణిస్తూ మీడియా కూడా యదాశక్తిన నిప్పు రాజేసే ప్రయత్నం చేసింది. ఆ తరువాత బాలకృష్ణ ఆ వార్తలను ఖండించడం జరిగింది. కానీ, ఇప్పుడు కొడాలి నానితో ఎన్టీఆర్ ఉన్న బ్యానర్ ప్రత్యక్షం అవడం మళ్ళీ కలకలం రేపుతోంది.
నాని అనుచరులే తమ అభిమానం చాటుకోవడానికి ఆ బ్యానర్ ఏర్పాటు చేసి ఉండవచ్చును. అలా కాని పక్షంలో టిడిపిలో ముసలం పుట్టించెందుకే కావాలని ఎవరో పనికట్టుకొని ఆ పని చేసి ఉండవచ్చును. ఈ విషయం ఇప్పటికే మీడియా దృష్టికి రావడంతో వార్తను హైలైట్ చేస్తూ విశ్లేషణలు మొదలు పెట్టేసి౦ది.