కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలి..

 

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు పేరును ఆయన సొంత జిల్లా కృష్ణా జిల్లాకు పెట్టాలని ఆ పార్టీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుడు మాగంటి మురళీమోహన్ డిమాండ్ చేశారు. తిరుపతిలోని మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పైవిధంగా డిమాండ్ చేశారు. ఆయన డిమాండుకు వేడుకలకు హాజరైన పార్టీ నేతల నుంచి మంచి మద్దతే లభించింది. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని మురళీమోహన్ అనగానే పార్టీ నేతలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ మద్దతు పలికారు.

 

 

ఇంకా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే తెలుగుదేశం పార్టీ ప్రధాన ఎజెండా అని అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచారని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలని కోరారు. ఐదున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాను కేంద్రం ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.