ఆగష్ట్ వరకూ డెడ్లైన్.. మరో ఉద్యమానికి ముద్రగడ
posted on May 28, 2016 12:56PM
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కాపు నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ విషయంలో ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే. అది అయిపోయిన తరువాత మళ్లీ ఇటీవల.. ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచిపోయింది అంటూ మరోసారి దీక్ష చేస్తామని ప్రకటించారు. కానీ ఆ తరువాత చేయలేదు. అయితే ఇప్పుడు మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం హైదరాబాద్లో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఇంకా కాంగ్రెస్ నేత, సినీనటుడు చిరంజీవిని కూడా ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఆగస్టులోగా మంజునాథ కమిషన్ నివేదికను తెప్పిస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీకి కట్టుబడి ఆగస్టులోపు కాపులను బీసీల్లో చేర్చాలని డెడ్లైన్ విధించారు. లేకపోతే ఉద్యమానికి సిద్ధమేనని ప్రకటించారు. కాగా ఆయన దాసరి నారాయణరావును, బొత్స సత్యనారాయణను కూడా విడివిడిగా కలవనున్నట్లు సమాచారం.