లగడపాటి చేతిలో చంద్రాస్త్రం..!!

 

 

 

రాష్ట్రవిభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తమ అభిప్రాయాలు పట్టించుకోకుండా ముందుకు వెళితే బ్రహ్మస్త్రం ప్రయోగిస్తాం అంటూ ప్రకటిస్తూ వచ్చిన లగడపాటి రాజగోపాల్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పార్టీకి పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటూ వస్తున్న రాజగోపాల్‌.. అధిష్టానం పై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన తిరిగి పార్టీలో కొనసాగే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో ఇప్పుడు లగడపాటి పార్టీ మారుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అది కూడా కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీలోకి అన్న వార్త రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది.


ఇప్పటికే ఈ దిశగా లగడపాటి వర్గం అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం.. త్వరలోనే వందలాది కార్యకర్తలతో ఆయన తెలుగుదేశం తీర్ధం పుచ్చుకోనున్నారట. అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంటున్నట్టుగా సమాచారం. అయితే ఈ సారి లగడపాటి విజయవాడ నుంచి కాకుండా ఏలూరు నియోజక వర్గం నుంచి పోటి చేయాలని భావిస్తున్నాడట. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి కూడా హామీ లభించినట్టుగా చెపుతున్నారు. ఇదే నిజమయితే ఇన్నాళ్లు కరుడు గట్టిన కాంగ్రెస్‌ వాదిగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఎలా మనగలుగుతారో.. ఆయనకు ఆ పార్టీ ఎలాంటి స్థానం కల్పిస్తుందో చూడాలి.