TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రైతు డిక్లరేషన్ కేవలం నయవంచనే...కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

Published on: Wed May 6, 2026 4:08PM

 

వరంగల్ జిల్లాలో నిర్వహించిన ‘రైతు సంగ్రామ సదస్సు’ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాకతీయ పౌరుషాల గడ్డ అయిన వరంగల్ నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు. రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ, ఇప్పుడు వారిని నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరంగల్‌లో గతంలో కాంగ్రెస్ ప్రకటించిన ‘రైతు డిక్లరేషన్’ ఒక అబద్ధాల పుట్ట అని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల ముందు 34 హామీలతో ప్రజలను నమ్మించి, ఇప్పుడు వాటిని గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. వంద రోజుల్లోనే అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పి, నెలలు గడుస్తున్నా రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేసిన అన్నదాతలు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా రైతు భరోసా పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఎకరాకు రూ. 10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తే, రూ. 15 వేలు ఇస్తామని ఆశ చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ప్రస్తుతం ఉన్న పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు మేళాలు కేవలం ప్రజలను దగా చేసేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమాలని ఆయన దుయ్యబట్టారు.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును కేటీఆర్ తప్పుపట్టారు. అధికారం చేపట్టినప్పటి నుండి సీఎం దాదాపు 69 సార్లు ఢిల్లీ పర్యటనలు చేశారని, కానీ రాష్ట్ర రైతాంగం కోసం కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ పర్యటనలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప, తెలంగాణ రైతుల కోసం కాదని ఆయన ఆరోపించారు.

రైతుల సహనాన్ని పరీక్షించవద్దని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకత్వానికి కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. వడ్ల కొనుగోలు ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీస్తారని హెచ్చరించారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం ఆపేది లేదని, ప్రతి గింజను కొనే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు.

రాబోయే రోజుల్లో రైతు సమస్యలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులను తెలుసుకుంటూ, వారి గళాన్ని అసెంబ్లీలోనూ, బయటా వినిపిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.