TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వ్యక్తిగత విమర్శలు మాని... విధానాలపై ఫోకస్ చేయండి : కేటీఆర్

Published on: Mon Apr 27, 2026 9:47PM

 

రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కీలక విన్నపం చేస్తూనే, ఆయన వ్యక్తిగత విమర్శలను మానుకోవాలని గట్టిగా హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఆ హోదాకు తగ్గట్టుగా హుందాగా వ్యవహరించాలని, అర్థం లేని ఆరోపణలు, అసభ్య పదజాలంతో విమర్శలు చేయడం సరికాదని కేటీఆర్ హితవు పలికారు. రేవంత్ రెడ్డి విధానపరమైన అంశాల మీద చర్చకు వస్తే ప్రతిపక్షంగా తాము సిద్ధంగా ఉన్నామని, కానీ విషం చిమ్మడం, వ్యక్తిగత దూషణలే లక్ష్యంగా పెట్టుకోవడం ఆయనకే మంచిది కాదని పేర్కొన్నారు.

రాష్ట్రంలో తిరిగి గతంలోని చీకటి రోజులు మొదలయ్యాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, ఎరువులు, విత్తనాల కొరత, కరెంట్ కోతలు, రైతు ఆత్మహత్యలతో తెలంగాణ రైతాంగం అల్లాడిపోతోందని ఆయన ఆవేదన చెందారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని, ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ఎంపీ తేజస్వీ సూర్య పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యల పట్ల కూడా కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ప్రేక్షకపాత్ర పోషించారని విమర్శించారు. తాము ఖండించిన తర్వాతే తేజస్వీ సూర్య వివరణ ఇచ్చుకున్నారని, అదే బీఆర్ఎస్ ఎంపీ ఉండి ఉంటే అక్కడికక్కడే క్షమాపణ చెప్పించేవారమని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ పార్టీని పునర్నిర్మించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. పార్టీలోని ప్రస్తుత రాష్ట్ర కమిటీ మినహా మిగిలిన అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల పునర్నియామకం చేపట్టి, పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.

రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తీరు మారకుంటే గ్రామ గ్రామాన ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలని, రానున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు.