TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈ కేరళ మహిళ నిజాయితీకి ఫిదా కావాల్సిందే!

Published on: Fri Oct 17, 2025 9:30AM

ఎంత డబ్బున్నా ఇంకా ఇంకా కావాలని అనుకునే వారు కోకొల్లలు. నిజాయితీ, న్యాయం, ధర్మం అనేవి ఆలోచించకుండా అప్పనంగా వచ్చే సొత్తుకోసం ఆశపడేవారి సంఖ్య అనంతం. అటువంటి సమాజాంలో ఒక నిరుపేద మహిళ చూపిన నిజాయితీ అందర్నీ ఫిదా చేస్తున్నది. తాను స్వయంగా పుట్టెడు కష్టాలలో ఉన్నా.. నిజాయితీని వీడలేదు. ఆ మహిళ పేరు స్మిజామోహన్. కేరళలో లాటరీ టికెట్లు అమ్మి పొట్టపోషించుకుంటోంది.  

ఆమె తన వద్ద అమ్ముడుపోని లాటరీ టికెట్లు కొన్ని ఉన్నాయనీ, వాటిని కొనుగోలు కొనమనీ తన రెగ్యులర్ కస్టమర్లను కోరింది. వారిలో చంద్రన్ అనే క్లయింట్ ఒక టికెట్ కొనేందుకు అంగీకరించాడు. ఫోన్ లోనే అతడు టికెట్ కొనడానికి అంగీకారం తెలిపి.. తనకు నచ్చిన ఒక లాటరీ టికెట్ ను ఎంచుకున్నాడు.  ఆ కొనుగోలు కూడా అరువుమీదే చేశాడు. అంటే తరువాత డబ్బులు ఇస్తానన్నాడు. ఇదంతా మౌఖిక లావాదేవీయే. తాను ఎంచుకుని కొనుగోలు చేసిన లాటరీ టికెట్ కు అతడు ఇంకా డబ్బు కూడా చెల్లించలేదు.  

సరే అతడు కొన్న టికెట్ కు ఆరు కోట్ల రూపాయల భారీ బంపర్ బహుమతి గెలుచుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే స్మజా మోహన్.. క్షణం ఆలస్యం చే యకుండా ఆ టికెట్ కొనుగోలు చేసిన చంద్రన్ కు ఫోన్ ద్వారా విషయం తెలిపి.. అదే రోజు అతడి ఇంటికి వెళ్లి అతడు అరువుపై మాట మాత్రంగా కొన్న లాటరీ టికెట్ ను అతడికి అందజేసింది.  ఈ విషయం తెలియగానే స్మిజా మోహన్ నిజాయితీని ప్రశంసిస్తూ ఆమెకు అసంఖ్యాకంగా ఫోన్ లు వచ్చాయి. దీనిపై స్పందించిన స్మిజా..  నిజాయితీయే అన్నిటికంటే ముఖ్యమని చెప్పింది. కస్టమర్లు లాటరీ టికెట్ కొనడానికి వెచ్చించే సొమ్మతోనే తాను జీవిస్తున్నానని పేర్కొంది. 

ఇంత తృణప్రాయంగా కోట్ల రూపాయలను కాదనుకుని నిజాయితీ, చిత్తశుద్ధి ప్రదర్శించిన స్మిజా మోహన్ సంపన్నురాలు కాదు. నిజానికి నిరుపేద. ఆమెకు డబ్బులు చాలా చాలా అవసరం. ఆమె పెద్ద కుమారుడు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో  బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. చిన్నకుమారుడికి క్యాన్సర్. తన పిల్లల చికిత్సకు ఆమెకు డబ్బు ఎంతో అవసరం. అయినా తనది కాని సొమ్ము కోసం ఆమె ఇసుమంతైనా ఆశపడలేదు. ఆమె నిజాయితీకి అంతా ఫిదా అవుతున్నారు.