TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

Published on: Fri Apr 17, 2026 9:42PM

 

పార్లమెంటు వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ అత్యంత ఘాటుగా స్పందించారు. రాహుల్ ప్రసంగాన్ని వినడం తనకు పెద్ద తలనొప్పిగా మారిందని, ఆయన పార్లమెంటును ఒక పరిహాసంగా మార్చేశారని ఆమె ధ్వజమెత్తారు.

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు, డీలిమిటేషన్ వంటి అంశాలపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ప్రధాని మోదీని ఉద్దేశించి ‘మెజీషియన్’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. రాహుల్ ప్రసంగంపై సభ వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కంగనా, తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

రాహుల్ గాంధీ ఇంకా తన బాల్యపు జ్ఞాపకాలు, చిన్నప్పుడు చూసిన మ్యాజిక్ షోల ప్రభావం నుంచే బయటకు రావడం లేదని కంగనా ఎద్దేవా చేశారు. "ఆయన ప్రసంగం వినడం ఒక పెద్ద తలనొప్పి. పార్లమెంటులో ఆయన ప్రవర్తన ఒక న్యూసెన్స్ లా ఉంది. స్పీకర్ ఎన్నిసార్లు వారించినా వినకుండా సభ గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరిస్తున్నారు" అని ఆమె ఆరోపించారు.

రాహుల్ గాంధీ తన ప్రసంగంలో కుల గణన, ఓబీసీల ప్రాతినిధ్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అయితే, కంగనా ఈ వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ.. రాహుల్ ప్రసంగంలో పస లేదని, కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని విడగొట్టేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

గతంలో కూడా రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై కంగనా తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి లోక్‌సభ వేదికగా ఇద్దరి మధ్య ప్రత్యక్ష, పరోక్ష యుద్ధం మొదలైంది. రాహుల్ వ్యాఖ్యలను అన్ పార్లమెంటరీగా భావిస్తున్న అధికార పార్టీ నేతలు, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

రాహుల్ గాంధీ ప్రసంగంపై హేమమాలిని వంటి ఇతర బీజేపీ నేతలు కూడా అసహనం వ్యక్తం చేశారు. వినోదం కోసం పార్లమెంటును వేదికగా చేసుకోవడం సరికాదని వారు హితవు పలికారు. ప్రస్తుతానికి ఈ వివాదం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.