తెలంగాణలో 3 ఎంపీ స్థానాలపై కన్నేసిన పవన్ కళ్యాణ్!!

 

పవన్ కళ్యాణ్ తాను స్థాపించిన జనసేన పార్టీని ఏపీకి మాత్రమే పరిమితం చేస్తారా అనే అనుమానాలు తలెత్తాయి. ఎందుకంటే ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ఈమధ్య తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం దూరంగా ఉన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏపీకి మాత్రమే పరిమితం చేస్తారా అని పలువురు అనుమానం వ్యక్తం చేసారు. అయితే ఇప్పుడు ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

త్వరలో తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల బరిలోకి జనసేన కూడా దిగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాల్లో కాదు.. కేవలం మూడు స్థానాల్లో మాత్రమే పోటీకి దిగబోతున్నట్లు సమాచారం. సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, ఖమ్మం పార్లమెంటరీ స్థానాల నుంచి జనసేన తరపున అభ్యర్ధులను నిలబెట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. తెలంగాణలో ఇంకా పార్టీ నిర్మాణం జరగలేదు. అందుకే ముందుగా ఈ మూడు స్థానాల్లో పోటీ చేయాలనే యోచనలో ఉన్నారట. ఈ మూడు స్థానాల్లో అయితే ఎంతో కొంత ప్రభావం చూపుతుంది.. తెలంగాణలో పార్టీ బలోపేతానికి తొలి అడుగు వేసినట్లు ఉంటుందని భావిస్తున్నారట. చూద్దాం మరి జనసేన తెలంగాణ ఎంట్రీ ఎలా ఉంటుందో.