అల్ రౌండ్ ప్రదర్శనతో ఆదరగోట్టిన పోల్లార్డ్
Published on: Thu Apr 12, 2012 9:26AM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐదో ఎడిషన్లో ముంబయి ఇండియన్స్ జట్టు మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. పోల్లార్డ్ 33 బంతుల్లో 64 పరుగులు, 4 ఓవర్లలో 4 వికెట్లు తీసి అద్భుత ఆల్రౌండ్ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్కు సీజన్లో తొలి ఓటమిని రుచి చూపించాడు. వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో హర్భజన్ సేన 27 పరుగులతో రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించింది. టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా, ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీస్కోరు సాధించింది.
198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు 19.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. మునాఫ్ ధాటికి ఏడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా, ఒవైస్ షా (42 బంతుల్లో 76; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రహానే (31 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా షా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌలర్ ఎవరనే అంశంతో సంబంధం లేకుండా సిక్సర్ల వర్షం కురిపించాడు. దీంతో 14 ఓవర్లలో రాజస్థాన్ 134 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగింది. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో మలింగ బౌలింగ్లో షా తో పాటు బోథా కూడా అవుటయ్యాడు. టెయిలెండర్లెవరూ క్రీజులో నిలబడలేకపోవడంతో మరో రెండు బంతులు మిగిలుండగానే రాజస్థాన్ ఆలౌటైంది. ముంబై బౌలర్లలో పొలార్డ్, మునాఫ్ నాలుగేసి వికెట్లు తీసుకోగా, మలింగ రెండు వికెట్లు పడగొట్టారు.


