హెచ్సీయూ కొత్త వివాదం... రోహిత్, అంబేద్కర్ ఫొటోలు తొలగింపు
posted on May 28, 2016 5:02PM
వివాదాలకు అడ్డాగా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరో వివాదం రేగింది. ఇప్పటికే వర్శిటీ ప్రాంగణంలో మొన్నటికి మొన్న రాత్రే శివుని విగ్రహం, నంది, నాగదేవత విగ్రహాలు పెట్టడంపై పలువురు విద్యార్ధులు నిరసన తెలుపుతుంటే ఇప్పుడు మరో వివాదం మొదలైంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ వేముల ఫోటోలను ఒక వర్గం విద్యార్థులు కొన్ని రోజుల క్రితం వర్సిటీలో పెట్టారు. అయితే నిన్న రాత్రి ఆ ఫోటోలను వర్సిటీ సిబ్బంది తొలగించారు. రోహిత్ వేముల ఫోటోలతో పాటు అక్కడి అంబేద్కర్ ఫోటోలను కూడా తీసేశారు. దీంతో విషయాన్ని గమనించిన విద్యార్థులు ఈరోజు ఆందోళనకు దిగారు. వర్సిటీ ప్రధాన గేటు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. దళిత విద్యార్థుల పట్ల వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో యూనివర్శిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.