TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గాంధీ భవన్‍లో తీవ్ర ఉద్రిక్తత...మల్లు రవి, కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం!

Published on: Sun May 24, 2026 2:19PM

 

తెలంగాణ అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వేదికగా తీవ్ర కలకలం రేగింది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల పార్టీ కార్యకర్తల అంతర్గత సమీక్షా సమావేశంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బూత్ లెవెల్ ఏజెంట్ల  పనితీరు, క్షేత్రస్థాయి నివేదికలపై చర్చించేందుకు హైదరాబాద్ పార్లమెంటరీ పార్టీ ఇంచార్జ్ మరియు కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి అధ్యక్షతన ఈ కీలక సమావేశం ఏర్పాటయింది. అయితే సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటా మాటా పెరిగి గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.

వివాదానికి ప్రధాన కారణం గోషామహల్ నియోజకవర్గ అంతర్గత రాజకీయాలేనని తెలుస్తోంది. గత ఎన్నికల్లో గోషామహల్ నుండి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థి సునీతా రావుకు సమాచారం లేకుండా, ఆమె సమక్షం లేకుండా ఈ నియోజకవర్గ సమీక్షను ఎలా నిర్వహిస్తారంటూ స్థానిక కార్పొరేటర్లు, ముఖ్య నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్ హోదాలో ఉన్న మల్లు రవిని నేరుగా నిలదీస్తూ నిరసనకు దిగారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న నేతలను పక్కనపెట్టి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్పొరేటర్లు ఒక్కసారిగా నిలదీయడంతో మల్లు రవి సైతం తీవ్ర అసహనానికి గురయ్యారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఏవైనా సమస్యలు ఉంటే పద్ధతి ప్రకారం తన దృష్టికి తీసుకురావాలని, అంతే తప్ప ఇలా బాధ్యతారాహిత్యంగా అరుస్తూ గొడవ చేయడం తగదని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు మరింత ముదిరాయి. తాను కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘానికి చైర్మన్ అని, తన ముందే క్రమశిక్షణ తప్పి ఇలాంటి రచ్చ చేస్తారా అంటూ మల్లు రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వివాదంతో గాంధీ భవన్ ప్రాంగణంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. బూత్ స్థాయి ఏజెంట్ల 100 శాతం పనితీరును సమీక్షించాల్సిన సమావేశం కాస్తా, నేతల అంతర్గత విభేదాల వేదికగా మారిపోయింది. హైదరాబాద్ లోని ముఖ్యమైన నియోజకవర్గాల నేతల మధ్య ఉన్న సమన్వయ లోపం ఈ ఘటనతో మరోసారి బహిర్గతమైంది. క్రమశిక్షణకు మారుపేరైన గాంధీ భవన్ లో సొంత పార్టీ నేతలే ఈ విధంగా వాగ్వాదానికి దిగడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.