TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐదు దశాబ్దాల కల..నెరవేరిందిలా.!

Published on: Sat Jul 18, 2026 8:39AM

ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రామీణ మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో  భాగంగానే ఐదు  దశాబ్దాలుగా రవాణా సౌకర్యాలకు నోచుకోని మారుమూల గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పించే పనులను అధికారులు వేగవంతం చేశారు. గత ఐదు దశాబ్దాలుగా సరైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బొడ్డుమామిడి గ్రామానికి   శాశ్వత రోడ్డు మార్గం సాకారమౌతోంది.   ఈ గ్రామానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న మట్టి రోడ్డు నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. 

గ్రామీణ ప్రాంతాల సమగ్ర వికాసమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం  అల్లూరి సీతారామరాజు జిల్లా, గంగరాజు మాడుగుల మండలానికి చెందిన బొడ్డుమామిడి గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించింది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా, సరైన రహదారి లేక అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లాలన్నా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా బొడ్డుమామిడి గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కోసం  ప్రభుత్వం   నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించింది. దీంతో దశాబ్దాల   ల సాకారమవుతుండటంపై గ్రామస్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

బొడ్డుమామిడి  గ్రామానికి రహదారి సౌకర్యాన్ని కల్పిస్తూ చేపట్టిన పనులు వేగంగా సాగుతుండటంతో తమ చిరకాల వాంఛను నెరవేర్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే  ప్రధాని నరేంద్ర మోదీలకు వారు  కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతోనే ఈ మారుమూల పల్లెకు శాశ్వత విముక్తి లభించిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే తమ సమస్యకు పరిష్కారం లభించిందని స్థానికులు చెబుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నాణ్యత విషయంలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్  మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దష్టి సారించి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. గ్రామీణ రోడ్ల నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకూడదని, నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే అధికారులకు విస్పష్ట ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేశారు.  సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి పవన్ కళ్యాణ్ స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలనలు జరుపుతూ, అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బొడ్డుమామిడి రోడ్డు పనులు వేగం పుంజుకున్నాయి.  

రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన పంచాయతీరాజ్ రోడ్ల నెట్‌వర్క్‌ను పునరుద్ధరించడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ మారుమూల పల్లెలను సైతం ప్రధాన రహదారులతో అనుసంధానించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఒక్క బొడ్డుమామిడి అనే కాదు..  ఎన్నో గిరిజన, మారుమూల గ్రామాలకు ఈ నిధుల ద్వారానే నేడు రోడ్డు కనెక్టివిటీ లభిస్తోంది. 

ప్రస్తుతం బొడ్డుమామిడి గ్రామానికి నిర్మిస్తున్న మట్టి రోడ్డు పనులు పూర్తి కావస్తుండటంతో రానున్న రోజుల్లో రవాణా కష్టాలు చాలా వరకు తీరనున్నాయి. అయితే..  వర్షాకాలంలో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, భవిష్యత్తులో ఈ మట్టి రోడ్డును  తారు,  లేదా సిమెంట్ రోడ్డుగా మార్చాలని గ్రామస్థులు కోరుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన నిధులు కూడా మంజూరు చేసి తమకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

Boddumamidi Village Road, Chandrababu Naidu, Pawan Kalyan, AP Rural Roads Development, Alliance Government AP