జగన్ కేంద్రంలో నీ ఓటు ఎటు?
posted on Sep 17, 2013 4:54PM
తెలంగాణ ఉద్యమాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయాన్ని తీసుకోలేదని చాలామందికి సుస్పష్టం. మరి ఏమి ఆశించి విభజన నిర్ణయాన్ని తీసుకుంది?వరుసగా రెండుసార్లు అధికారాన్ని కైవసం చేసుకుని,మూడవసారి ఎన్నికలలో గెలవాలి అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ప్రజల వ్యతిరేకతను అధిగమించటానికి రాష్ట్రంలో విభజన నిర్ణయాన్ని తీసుకుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తిలేదు.
విభజన వలన తెలంగాణలో టి.ఆర్. ఎస్ ని కలుపుకుని గెలవవచ్చునని,ఆంద్ర రాయలసీమ ప్రాంతంలో వై.యస్.ఆర్.సి.పి గెలుస్తుందని,ఎన్నికల తరువాత వారు కేంద్రంలో యు.పి.ఎ ని సపోర్ట్ చేస్తారని అనే ధీమాతో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని చాలామంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జగన్ జైలుకు వెళ్లకముందు ఆయన తల్లి విజయమ్మ బి.జె.పి ని సమర్ధించటం,కేంద్రం లో యు.పి.ఏ ని బలపరుస్తామని చెప్పటమే ఈ అభిప్రాయానికి కారణమా?
మరి మారిన రాజకీయ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ని తీవ్రంగా ఆంద్ర రాయలసీమ ప్రాంత వాసులు వ్యతిరేకిస్తున్న ఈ సందర్భంగా కూడా వై.ఎస్.ఆర్.సి.పి 2014 ఎన్నికల తరువాత విభజిస్తే కేంద్రంలో యు.పి.ఎ ని సమర్ధిస్తారా అనేది ప్రజలకు తెలియవలసి ఉంది. వై.ఎస్.ఆర్.సి.పి ఈ విషయంలో మరొకసారి స్పష్టంగా చెప్పని పక్షంలో ఈ విభజన కుట్రలో వై.ఎస్.ఆర్.సి.పి భాగస్వామ్యం ఉందని ప్రజలు భావించవలసి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కూడా స్పష్టంగా రాష్ట్ర విభజన జరిగితే 2014 తరువాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని వై.ఎస్.ఆర్.సి.పి సమర్ధిస్తుందా అని ఎందుకు నిలదీయదు?