కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలలో మలుపు
posted on Sep 24, 2013 12:15PM
సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల రాజీనామాల వ్యవహారం మరో మలుపు తిరిగింది. కొందరు ఎంపీలు రాజీనామాకు సిద్దపడితే మరికొందరు వెనక్కి తగ్గారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలకు ఉదయం 11 గంటలకు స్పీకర్ మీరాకుమార్ అపాయింట్మెంట్ లభించింది. ఎంపీలు లగడపాటి, ఉండవల్లి, సాయిప్రతాప్, ఎస్పీవైరెడ్డి, రాయపాటి, అనంత, హర్షకుమార్, మాగుంట స్పీకర్ను కలవనున్నారు. సమైక్యాంధ్ర కోసం తమ రాజీనామాలు ఆమోదింపజేయాలని స్పీకర్ను ఎంపీలు కోరనున్నారు.
ఇప్పుడు అందులో కొందరు వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనుమూరి బాపిరాజులు రాజీనామాలపై వెనక్కి తగ్గారు. రాయపాటి సాంబశివ రావు, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామి రెడ్డిలు రాజీనామాలకే మొగ్గు చూపుతున్నారు. హర్ష కుమార్, సాయి ప్రతాప్, ఎస్పీవై రెడ్డిలు రాజీనామాలపై తర్జన భర్జన పడుతున్నారట.
మరోవైపు లోక్సభ స్పీకర్ మీరాకుమార్ మంగళవారం ఉదయం పాట్నాకు బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలను ఈనెల 28 లేదా 30న రావాలని స్పీకర్ సూచించారు.