బాబు ఆత్మగౌరవ యాత్ర
posted on Aug 20, 2013 4:23PM
విభజన విషయంలో ఎంపీ హరికృష్ణ వైఖరి ఎలా ఉన్నా ..పార్టీలోని సమైక్య నేతలు ఏం మాట్లాడినా చివరకు నేను చెప్పింది మాత్రమే ఫైనల్ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తేల్చిచెప్పారు. త్వరలోనే తాను తెలుగు ఆత్మగౌరవ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నానని, తెలుగు జాతి విధ్వంసాన్ని అరికడతానని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల మధ్య అనుబంధాలు పెంపొందేలా చేయాలి తప్ప విద్వేషాలు పెంచడం సరికాదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ది కోసం ఇరు ప్రాంతాల మధ్య గొడవలు పెట్టి రెచ్చగొడ్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. విభజన ద్వారా ఇరుప్రాంతాలలో ఓట్లు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తుందని, ప్రత్యేక మయిన పరిస్థితుల్లో తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చామని, దానికి కట్టుబడి ఉంటామని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా సీడబ్లూసీ నిర్ణయం తీసుకోకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ నెల 25న లేదా ఈ నెల 29న ఆత్మగౌరవ యాత్ర ప్రారంభిస్తామని తెలిపారు.