అభివృద్ధి చేస్తా..దొంగలను పరిగెత్తిస్తా: బాబు

 

 

 

నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా తనకు వుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో తొమ్మిదేళ్ళు అధికారంలో వున్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత తనకుందని ఆయన గుర్తు చేశారు. తాను విజన్ 2020 అంటే కొంతమంది 420అని ఎగతాళి చేశారని కానీ ఇప్పుడు వారే 420లుగా మారారని ఆయన ఎద్దేవా చేశారు. తాను అభివృద్దిలో ప్రపంచానికే పాఠాలు చెప్పానని..వైకాపా నేతల నుంచి నేర్చుకోవాల్సిన దుస్థితి ఇంకా తనకు రాలేదని మండిపడ్డారు. టీడీపీ హయాంలో హైదరాబాద్ ఆదాయం పెరిగిందని శ్రీకృష్ణ కమిటీ గణాంకాలతో తెలిపిందనే విషయాలు సభలో గుర్తుచేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి చేయడానికి తన వద్ద మంత్రదండం ఏమిలేదని..కానీ రాబోయే ఐదేళ్లలో మెరుగైన పాలన అందిస్తామని బాబు ఉద్ఘాటించారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని కఠిన చర్యలు తీసుకుంటామని బాబు అన్నారు. దొంగలపై కేసులు పెడతామని చెప్పారు. తన పాలన దొంగల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుందని హెచ్చరించారు. వ్యక్తిగతంగా తాను ఎవరపై విమర్శలు చేయడం లేదని పేర్కొన్నారు.