TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోడ్ల నాణ్యత.. దేశంలోనే ఏపీ నంబర్ 2.!

Published on: Fri Jul 10, 2026 10:38AM

ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల నాణ్యత దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. జగన్ హయాంలో ఐదేళ్ల పాటు.. ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై దేశ వ్యాప్తంగా సెటైర్లు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పొరుగు రాష్ట్రంలో అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు.. ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితిని ఎత్తి చూపుతూ తెలంగాణ అభివృద్ధి గురించి గొప్పగా చెప్పుకునే వారు. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అంటే గుంతలేనని ఎద్దేవా చేసేవారు. ఆ రహదారులపై ప్రయాణించలేక జనం అవస్థలు పడేవారు. గుంతల మయమైన రోడ్ల కారణంగా ప్రమాదాలకు గురై పెద్ద సంఖ్యలో మరణాలు కూడా సంభవించాయి. అయితే అదంతా గతం. 

రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు మరీ ముఖ్యంగా   గ్రామీణ రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండేళ్లలోనే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడింది. ఏపీలో రోడ్ల నాణ్యత ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్ వై) జాతీయ తనిఖీ నివేదికల ప్రకారం, గ్రామీణ రోడ్ల నాణ్యతలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.

గతంలో..  అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో రోడ్ల నాణ్యతలో దేశంలో దారుణంగా 19వ ర్యాంకులో ఉన్న ఆంధ్రప్రదేశ్ తాజా నివేదిక ప్రకారం   2వ స్థానానికి ఎగబాకి  కొత్త రికార్డు సృష్టించింది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 19వ స్థానం నుండి రెండో స్థానానికి చేరడం ఒక అద్భుత విజయంగా.. పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పీఎంజీఎస్‌వై నేషనల్ క్వాలిటీ మానిటరింగ్ విభాగం ఏప్రిల్ 2025 నుండి మార్చి 2026 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా పూర్తయిన రోడ్డు పనులపై సమగ్ర మూల్యాంకనం నిర్వహించి ఈ ర్యాంకులను ప్రకటించింది. ఈ జాబితాలో గుజరాత్ మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానాన్ని దక్కించుకుంది

జాతీయ స్థాయిలో మొత్తం 2 వేల 948 రోడ్లను కేంద్ర బృందాలు   తనిఖీ చేయగా, అందులో 441 రోడ్లు నాణ్యతా ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రాష్ట్రవ్యాప్తంగా తనిఖీ చేసిన 126 ప్రధాన గ్రామీణ రహదారుల్లో కేవలం ఒక్కటంటే ఒక్క రోడ్డు మాత్రమే ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన నూటపాతిక రోడ్లూ కూడా,  అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో నిర్మితమయ్యాయని కేంద్ర నివేదిక పేర్కొంది. 

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్,  గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న   నిర్ణయాలు, పటిష్టమైన నిఘా వ్యవస్థే రోడ్ల నాణ్యత విషయంలో ఏపీ ఈ ఘనత సాధించడానికి కారణమని చెప్పవచ్చు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచే..  పవన్ కళ్యాణ్ గ్రామీణ రహదారుల పునర్నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి తావులేకుండా, నిధులు దుర్వినియోగం కాకుండా కఠిన నిబంధనలను అమలు చేశారు. సోషల్ మీడియా వేదికల ద్వారా మారుమూల గ్రామాల ప్రజలు తమ ప్రాంతాల్లోని   రోడ్ల పరిస్థితి గురించి  ఫిర్యాదు చేసిన ప్రతి సందర్భంలోనూ  పంచాయతీరాజ్ శాఖ తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేస్తూ మరమ్మతులు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షణ సమన్వయంతో సాగడం వల్లే ఏపీ రోడ్ల వ్యవస్థలో ఈ మార్పు సాధ్యమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Pawan Kalyan, Andhra Pradesh News, PMGSY National Rankings, Rural Road Development, AP Panchayat Raj