రాజ్యాంగంలోనే రాష్ట్ర సమైక్యతను కాపాడగల క్లాజు [ఇ]?!

 

ఎబికె ప్రసాద్


[సీనియర్ సంపాదకులు]

 

 

 

రాజనీతి శాస్త్రాన్ని కాస్తా స్వతంత్రభారతదేశంలో "పదవీరాజకీయ శాస్త్రం''గా మార్చిన 'ఘనులు' కాంగ్రెస్ నాయకులు! అలాంటివాళ్ళు దేశ సమాఖ్య (ఫెడరల్)వ్యవస్థను ప్రజాప్రయోజనాల రక్షణకు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాల సుస్థిరతకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు తోడునీడగా ఉండకుండా కేవలం ఎన్నికలలో విజయం సాధించడం కోసం 'పావు'గా వినియోగించుకుంటూ వస్తోంది. అలాంటి తాజాగా చేతివాటంగా అందివచ్చిన 'పావు' - స్వతంత్ర భారతంలో భాషాప్రయుక్త ప్రాతిపదికపై మొట్టమొదటిసారిగా ఏర్పడిన పెద్దరాష్ట్రమైన తెలుగువారి "ఆంధ్రప్రదేశ్''ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో తమ నాయకురాలైన ఇటాలియన్ సోనియా రాజకీయ కుటుంబ ప్రయోజనాలకోసం అశాస్త్రీయంగా నిట్టనిలువునా చీల్చడానికి తీసుకున్న నిర్ణయం! ఆంధ్రప్రదేశ్ లో భాగమైన తెలంగాణా ప్రాంతంలో 15 పార్లమెంటు సీట్లకోసమని వేర్పాటువాదులయిన కొందరు రాజకీయ నిరుద్యోగులతో చేతులు కలిపి కాంగ్రెస్ ఈ పనిచేసి, తెలుగుజాతికి విద్రోహం తలపెట్టి, ఆ విద్రోహాన్ని సమర్థించుకోడానికి మరికొన్ని తప్పులు చేస్తూ పోతోంది. ఇందుకు అది ఆధారపడుతున్నది రాజ్యాంగంలోని 2,3,4 అధికరణలమీద. ఈ మూడింటి సారాంశం - భారత యూనియన్ లో కొత్తరాష్ట్రాలను ఏర్పరచడానికి, ఉన్న రాష్ట్రాలనుంచి భూభాగాలను చీల్చి మరొక రాష్ట్రంలో విలీనం చేయడానికి పార్లమెంటుకు శాసనాధికారం ఉన్నదని చెప్పడం. 3వ అధికరణ ప్రకారం - నూతన రాష్ట్రాలను ఏర్పర్చడమే గాక, ప్రస్తుతమున్న రాష్ట్రాల వైశాల్యాన్ని పెంచడానికి, లేదా కుదించడానికి, లేదా వాటి సరిహద్దుల్ని మార్చడానికి లేదా ఆ రాష్ట్రాల పేర్లను కూడా మార్చడానికి శాసనం రూపొందించే హక్కు పార్లమెంటుకు ఉంది!

 

 

అయితే పాలనాధికారాన్ని చేపట్టే రాజకీయపార్టీలు తమ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం తమ "బ్రూట్ మెజారిటీ''ద్వారా తమ ఇష్టానుసారం రాష్ట్రాలను విభజించడానికి ఈ అధికరణవల్ల అవకాశం దొరికింది! రానురానూ ఈ తప్పుడు సంప్రదాయం ఎక్కడికి దారితీస్తోంది? పాలనా పగ్గాలు పట్టుకున్న అధికారపక్షాలు భారత సమాఖ్య వ్యవస్థలోని రాష్ట్రాల ప్రజల మెజారిటీ అభీష్టాన్ని, ప్రజలు ఎన్నుకున్న రాష్ట్రాల చట్టసభలనూ ఖాతరు చేయకుండా కూడా కొత్తరాష్ట్రాలను స్వార్థప్రయోజనాలకోసం ఏకపక్షంగా ఏర్పర్చచే దుష్ట సంప్రదాయాన్ని నెలకొల్పుతోంది. ఇది పంజాబ్-హర్యానాలుగా పంజాబ్ విభజనతోనే మొదలయింది! పంజాబ్ శాసనసభ అభిప్రాయంతో నిమిత్తం లేకుండా సభ ఆమోదముద్ర లేకుండానే కేంద్రంలోని కాంగ్రెస్ అధికారపక్షం పంజాబ్ ను విభజించేసింది! రాజకీయ ప్రయోజనాల కోసం పంజాబ్ ఐక్యతను బలిగొన్నది! అదే పద్ధతిని ఇప్పుడు దేశంలోని తొలి భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ను బలిగొనజూస్తోంది! ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తనకు తననే ఆంధ్రప్రదేశ్ లో ఆత్మాహుతికి సిద్ధమవుతోంది! కొందరు వేర్పాటువాద నాయకుల వత్తిడికి తలొగ్గిన కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఆంధ్రప్రదేశ్ ను 3వ అధికరణ ఆధారంగా విభజించడానికి సిద్ధమయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలైన ఇటాలియన్ సోనియా నాయకత్వంలో హోంమంత్రిత్వశాఖ రాష్ట్ర విబజనకోసం మూడు రకాల ప్రతిపాదనలతో ఒక "నోట్'' (పత్రం) తయారుచేసింది. దాన్ని మంత్రి షిండేకి సమర్పించింది. ఇదో విచిత్రమైన పత్రం! దీనికి పునాది రాజ్యాంగంలోని 3వ అధికరణమే అయినా, హోంశాఖ "నోట్''లో మొదటి అంశం పూర్తిగా ప్రజల పరిశీల దృష్టికి యింకా వచ్చినట్టులేదు!



అది - "పదిజిల్లాలతో ఏర్పడగల తెలంగాణా రాష్ట్రంలో ఆ పదిజిల్లాలతో పాటు తెలంగాణలో ఐచ్చికంగా ఏ ఇతర జిల్లాలయినా సరే వచ్చి చేరదలిస్తే అవన్నీ చరవచ్చు. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న పిమ్మట తెలంగాణాగానే ఏర్పడుతుంది'' ["Along with 10 districts, any other disstricts that voluntarily come forward to join in Telangana will be taken into consideration and Telangana will be formed]!



 

ఈ "నోట్''ను ఎవరు తయారుచేశారోగాని సదరు పత్రకారుడు సరసుడే కాదు, ప్రజలను విభజించి-పాలించటం తెలియని అజ్ఞాత సమైక్యవాది అయి ఉండాలి! రాష్ట్ర మెజారిటీ, ప్రజల ఆకాంక్షకు అనువునంగానే ఈ 'నోట్' డ్రాఫ్టింగ్ తయారైనట్టుంది! చివరికి ఏ కేంద్రపాలకపక్షం ఏ "3''వ రాజ్యాంగఅధికరణ ఆధారంగా, ఐక్యంగా ఉన్న తెలుగుజాతిని చీల్చాలని ఉవ్విళ్ళూరుతోందో సరిగ్గా అదే అధికరణలోని "ఇ''క్లాజు కూడా "రాష్ట్రం పేరును మార్చుకోవచ్చు''నని అభ్యంతరం లేదనీ చెప్పింది! అంటే హోంశాఖవారి అద్భుతమైన 'డ్రాఫ్టింగ్' పర్యవసానంగా వెలువడిన ఆ "నోట్'' తెలంగాణాలోని పదిజిల్లాలతో పాటు మరిన్ని జిల్లాలు, ఎన్ని జిల్లాలు వస్తే అన్ని జిల్లాలు 'తెలంగాణా రాష్ట్రం'గా ఏర్పడవచ్చునని బాహాటంగానే ప్రకటించినట్టయింది! ఆ లెక్కన రాష్ట్రంలోని మిగిలిన 13జిల్లాలు కూడా ఆ పదిజిల్లాలతో కలిసిపోతే - అదే హోంశాఖ "నోట్'' ఆశిస్తున్న మొత్తం రాష్ట్రం అంతా నిజంగానే అక్షరాలా "తెలంగాణా'' అవుతుంది గదా!! ఎందుకంటే, ఈ మాట వ్యంగ్యంగా అనటంకాదు, ఎగతాళి కోసం అంటున్న మాట అంతకంటే కాదు. నిజానికి "తెలంగాణం'' అంటే తెలుగులకు (తెలుగువారికి) అణెము, అంటే తెలుగువారు నివశించే చోటు అనీ, ప్రాంతం అనీ, నివాసమనీ వ్యవహారార్థమూ, విశిష్టార్థమూనని గుర్తించాలి! పండితులూ, నిఘంటుకారులూ స్థిరపరిచిన స్థిరనివాసమే తెలుగువారి తెలంగాణం! చరిత్ర తెలియని మన తెలుగు రాజకీయ సన్యాసులకన్నా, గిరీశం భాషలో మన 'వెధవాయిల'కన్నా కోస్తాంధ్ర, సీమాంధ్ర ప్రాంతాలతో పాటు సుమారు 300 ఏళ్ళపాటు దక్కన్ వరకూ ఏలికలుగా ఉన్న మహమ్మదీయ పాలకులు తెలుగు పాలకులకన్నా తెలివిగల వాళ్ళు కాబట్టి తాము పాలిస్తున్న నివసిస్తున్న ప్రాంతమంతా తెలుగువారిది కనుకనే మొత్తం తెలుగుప్రాంతాన్ని 'తెలంగాణం' [15-16 శతాబ్దాల దేశపటాల్లో "తెలంగాణం'' అని లిఖితపూర్వకంగా పేర్కొని] అని పేరుపెట్టుకున్నారని గుర్తించాలి!


 

అందువల్ల "తెలంగాణా రాష్ట్రం'' అంటే మొత్తం తెలుగు ప్రాంతమంతటికీ వర్తిస్తుంది కాబట్టే హోంశాఖ "నోట్'' తెలుగువారి అన్ని జిల్లాలూ వచ్చి చేరమని ("any other districrs that come forward")  ఆహ్వానం పలికి ఉంటుంది! మరో మాటలో చెప్పాలంటే మిగతా 13 సీమాంధ్రజిల్లాలు కూడా వెరసి మొత్తం 23 జిల్లాలతో కూడిందే తెలంగాణం/ఆంధ్రప్రదేశ్ లేదా విశాలాంధ్ర రాష్ట్రం గదా! అందువల్ల ఇప్పుడున్నదంతా 'తెలంగాణం' అదే 'తెలుగునాడు! కాబట్టి రాజ్యాంగంలోని 3వ అధికరణం "ఇ''సెక్షను ప్రకారం "ఆంధ్రప్రదేశ్'' రాష్ట్రాన్ని కృత్రిమంగా విభజించకుండానే పేరును అర్థవంతంగా అమరగల "తెలంగాణా''గా లేదా "తెలుగునాడు''గా మార్చుకోవచ్చు! తద్వారా "విభజన'' అనే పురుగును, లేదా 'కలుపుమొక్క'ను లేదా 'బి.టి.'లాంటి వినాశకర విత్తనాన్ని [టెర్మినేటర్ సీడ్] మనస్సులనుంచి పెకించివేయవచ్చు! తొలుత దేశంలోనే తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా తెలుగువారి రాష్ట్రం ఏర్పడినప్పుడు, రెండురకాల పరాయి పీడనా పాలనలనుంచి తెలుగుజాతి ఒక్క గొడుగుకిందికి వచ్చినప్పుడు ఆకారాది క్రమం కోసం అటు ఇంగ్లీషు వర్ణమాలకు, ఇటు తెలుగువర్ణమాలకు తొలి అక్షరంతో 'A'/ 'ఆ'/"ఆంధ్రప్రదేశ్" (Andhra Pradesh) ఏర్పడడం శుభదాయకం అనుకున్నారు పెద్దలు. ఆ ఆశతోనే, పేరు తప్పు సమాసం అయినా "ఆంధ్రప్రదేశ్' పేరును ఎంచుకోవటం జరిగింది. కాని, ఆకారాదిక్రమంలో తొలి అక్షరంతో మనం 8వ షెడ్యూల్ లో అగ్రభాగంలో కనిపించినంతమాత్రాన అభివృద్ధికి చిహ్నం కాదు, అలా లేకపోయినంత మాత్రాన ఒక రాష్ట్రం పేరు కడుపంక్తిలో [ఉదా: తమిళనాడు - Tamilnadu ఉందికాబట్టి ప్రగతిపథంలో అది అట్టడుగున ఉందనీ చెప్పలేం!]



 

అందువల్ల, వ్యక్తులకుగానీ, రాష్ట్రంకుగాని వారికి (వాటికి) తగినట్టుగా అర్థవంతంగా ఉండాలేగాని 'పేరు' బలాల్ని బట్టి, 'నక్షత్రబలాల్ని' బతి విలువలూ, గౌరవప్రతిష్టలూ సమకూడవు! ఎందుకంటే అబద్ధాలతో, బూతులతో 'ఉద్యమాలు' నిర్మించేవారంతా చచ్చినా కొమరం భీములూ కాలేరు, దొడ్డి కొమరయ్యలూ కాజాలరు; వినాయక వేషధారులంతా ప్రజానాయకులు కారు; గాంధీ పేరుతొ చెలామణీ కాదలచుకునే వారంతా గాంధీలూ కారు, భగత్ సింగ్ పేరు తగిలించుకునే వారు విప్లవకారులూ కాలేరు; అల్లూరి సీతారామరాజును కొలిచేవారంతా ఆయని పేరు ఉచ్చరించడానికీ తాగారు; రుద్రమ పేరు పెట్టుకున్న వారంతా వీరనారీమణులూ కారు; చిత్తం చెప్పులమీద భక్తి శివుడిమీద నిలిపే వారంతా నిజమైన భక్తులూ కారు; యావదాంధ్ర శ్రమజీవుల ప్రతినిధిగా కష్టజీవులకు బతుకునిచ్చే బతుకమ్మ/అదే దుర్గమ్మ/అదే గౌరమ్మను కాస్తా హైజాక్ చేసి క్షుద్ర రాజేకీయాలకోసం వాడుకో జూసే సంపన్నుల బతుకులు బతుకులూ కావు; ఒక్క ముక్కలో చెప్పాలంటే - ఆంద్ర (తెలుగు) జాతి చరిత్రకూ దాని వేల సంవత్సరాల సంస్కృతీ విభావానికీ ఐకమత్యానికీ దివిటీలుగా నిలిచినా శాతవాహన, కాకతీయ, విజయనగర ప్రజాహిత పాలనా యుగాలను విస్మరించిన తెలుగుజాతి విచ్చిన్నకులూ, అందుకు దోహదం చేసిన ఆధునిక విద్యోజులయిన రాకీయ దుర్యోధన, దుశ్శాసనలూ మూడు ప్రాంతాల ప్రజాబాహుళ్యం గుండెల్లో శాశ్వత శత్రువులుగా నమోదు కాకుండా తప్పించుకోలేరు; తెలుగువారి మహాయుగాల ఆనవాళ్ళను చేరిపివేయడానికి ప్రయత్నించిన ఆధునిక రాజకీయ 'సామంతులు'గా, చరిత్రహీనులుగా వీళ్ళు మిగిలిపోతారు!


 

ఎందుకంటే, "ప్రజాప్రతిదుల'' వేషంలో దేశ, రాష్ట్రాల వివిధ పాలకపక్షాలు,ముఖ్యంగా దీర్ఘకాలంపాటు దేశాన్ని ఏలుతూ వచ్చిన చెడిపోయిన కాంగ్రెస్ తో కొన్ని ప్రధాన ప్రతిపక్షాలూ ఇన్నేళ్ళుగా భారత రాజ్యాంగ చట్టాన్ని సహితం తమ కుత్సితమైన స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలకోసం కొన్ని తప్పుడు సవరణలతో పక్కదారులు పట్టించడానికి సహితం వేనుదీయలేదు. వాటిల్లో కొన్ని - రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి, బ్యూట మెజారిటీ ద్వారా పార్లమెంటును చాటు చేసుకుని నేటి - రేపటి పాలకపక్షాల స్వార్థ ప్రయోజనాల కోసం చేసిన సవరణలు! ఈ సవరణలేవీ డాక్టర్ అంబేడ్కర్ లేదా తొల్లింటి ముసాయిదా రాజ్యాంగం తలపెట్టినవికావు!  స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ పాలకులూ, మతరాజకీయాలను నిరసించిన ఆ రాజ్యాంగ సభ నిర్ణయాలనే అవమానించి ఉల్లంఘిస్తూ వచ్చిన బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలూ, వాటి సంకీర్ణ పాలనా వ్యవస్థలూ రాజ్యాంగాన్ని వక్రమార్గం పట్టిస్తూ రాజ్యాంగం ఫెడరల్ (సమాఖ్య) స్వభావానికీ, దాని ప్రజాహిత స్ఫూర్తికీ బద్ధవిరుద్ధమైన సవరణ చట్టాలు తీసుకొచ్చారు! వాటిలో నేటి రాష్ట్ర సమస్యకు ప్రత్యక్షంగా సంబంధం కలవి రాజ్యాంగంలోని 3వ అధికరణ ఒకటికాగా, ఆ సవరణ కేంద్రం రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణక్కు భాషాప్రయుక్త ప్రాతిపదికపైన ప్రజాహితంగా దేశంలోనే తొలిమెట్టుగా తెలుగుజాతినంతనూ ఒక్క గొడుగుకిందికి తెచ్చేందుకు సాధికార కమీషన్ సిఫారసులు ఆధారంగానే 'ఆంధ్రప్రదేశ్' రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది; దానికి తగినట్టుగానే రాష్ట్రంలోని మూడుప్రాంతాల మధ్య కాలక్రమంలో ఉద్యోగ సద్యోగాలలో ప్రాంతాలమధ్య సమతుల్యమైన ఆర్థికాది రంగాలలో సాధ్యమైనంత త్వరగా అభ్యుదయాన్ని సాధించడం కోసం ఏ ఇతర రాష్ట్రానికీ లేని ఒక విశిష్టమైన ప్రత్యేకమైన (స్పెషల్) సవరణ చట్టాన్ని 371 (డి) పేరిట రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది.


 

కాగా కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన 3వ అధికరణ భాషాప్రయుక్తంగా ఏర్పడిన రాష్ట్రానికి రాజకీయ ప్రయోజనాలు ఈడేర్చుకోడానికి ఉద్దేశించింది కాదు కనుకనే ప్రత్యేకంగా మన రాష్ట్రం సుస్థిరత కోసం 371 అధికరణకు "డి'' క్లాజుద్వారా రాజ్యాంగానికి సవరణ చట్టం తీసుకువచ్చి, దానికి భాష్యం చెప్పాలన్నా, వ్యతిరేకంగా తీర్పు చెప్పాలన్నా ఒక్క సుప్రీంకోర్టుకు తప్ప, మిగతా ఏ కోర్తుకూ, చివరికి ఉద్యోగాలకు చెందిన మార్పులకూ, ప్రమోషన్లకూ మరే యితర సంబంధిత సమస్యలపైనా తీర్పులుగానీ, వ్యాఖ్యానాలుగాని చేసే హక్కు లేకుండా చేసింది! అంటే, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే హక్కును పార్లమెంటు ద్వారా కేంద్రప్రభుత్వానికి సంక్రమింపజేస్తున్న 3వ అధికరణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చడానికి వినియోగించే ముందు 371 (డి) సవరణ చట్టానికి మూడింట రెండువంతుల మెజారిటీ ద్వారానే పార్లమెంటుకు, దానిద్వారా కేంద్ర క్యాబినెట్టుకూ సాధ్యమవుతుంది గాని అడ్డదారుల్లో కాదు! పైగా, హోంశాఖ చూపిస్తున్న "నోట్''లో, నేడు ప్రజావ్యతిరేకులుగా మారి ప్రజలకోసం పదవుల్ని త్యాగం చేయలేని 'దేహభక్తి'కి తప్ప దేశభక్తికి దూరమైనా నాయకులకు తెలియని ఒకటి రెండవ అంశంగా ఉంది. ఆ అంశం నిజానికి రాజ్యాంగంలోని 3వ అధికరణకు సంబంధించి యిచ్చిన "ఒకటవ వివరణ''లోనే ఉంది. ఇది రెండురకాల భాష్యానికి అవకాశమిస్తోంది.


 

ఎలా అంటే, 3వ అధికరణలో 'ఎ'నుంచి 'ఇ'వరకూ ఉన్న క్లాజుల్లో "రాష్ట్రం'' అనే పదంలో కేంద్రపాలిత (యూనియన్ టెరిటరీ - యు.టి.)ప్రాంతం అనే పదం కూడా చేరి ఉంది! అయితే జనాన్ని పాలకపక్షాలు గందరగోళ పరచడం కోసం చేసిన ప్రయత్నం మినహాయింపు "క్లాజు'' పేరిట "రాష్ట్రం'' అనే పదంలో "కేంద్రపాలిత ప్రాంతం'' చేరి ఉండదని అదే "వివరణ (1)''లో విరుద్ధంగా పేర్కొనడమూ! ఇటీవల కొందరు పార్లమెంటు సభ్యులూ, రాష్ట్రప్రజలూ, రాష్ట్రేతర స్థానిక వ్యాపారులూ, ప్రజలూ దశాబ్దాలుగా పెంచి, అభివృద్ధి చేసిన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని "కేంద్రపాలితప్రాంతం''గానో (యు.టి) లేదా దేశానికి రెండవ రాజధానిగానో ప్రకటించిన తరువాతనే రాష్ట్ర "విభజన'' గురించి ఆలోచించాలిగాని అంతకుముందు కాదని ప్రతిఆదించడానికి కారణం - 3వ అధికరణంలోని ఈ అయోమయపు "వివరణ 1''! కాబట్టి - మొత్తం తెలుగుజాతి ఉనికినీ, భారతదేశ చరిత్రలో దాని విశిష్టతనూ సంరక్షించి కాపాడుకోడానికిగాను, "ఆంద్ర'' అనే పదా(తెలుగు అనేది తెలియక)నికి అజ్ఞానంతో కొందరు 'ఎలర్జీ' పెంచుకుని తెలుగుజాతి మూలాలనే నరుక్కోబోయే వారిని కూడా కలుపుకుని వచ్చేందుకు వీలుగా రాష్ట్రాన్ని మొత్తంగా 3వ అధికరణలోని "ఇ''క్లాజు ప్రకారం గానీ నామకరణం చేయడానికి ఏ ఆంధ్రుడికీ ఏ తెలుగువాడికీ అభ్యంతరం ఉండదు, మనసారా ఆహ్వానించి తీరుతాడు! సెంటిమెంటును గౌరవించాలనుకునే వారంతా కోస్తా నుంచి దక్కను దాకా తెలుగువారి నివాసప్రాతంగా ''తెలంగాణా'' పేరు హేతుబద్ధమైన పేరు రాష్ట్రానికి చక్కగా అమరుతుంది, అర్థవంతంగా భాసిల్లుతుంది, అరమరికలులేని తెలుగుజాతికి ఆత్మవిశ్వాస సోర్యోదయంగా చిరంజీవిత్వం కల్గిస్తుంది!