మోహన్ బాబు 'పద్మశ్రీ'ని వాడొద్దు: సుప్రీం
Published on: Fri Apr 11, 2014 1:29PM
.jpg)
ప్రముఖ నటుడు మోహన్ బాబుకు పద్మశ్రీ అవార్డ్ వివాదంలో సుప్రీంకోర్ట్ షాకిచ్చింది. 'పద్మశ్రీ' పేరును ఇప్పటి వరకూ ఉపయోగించిన ప్రతి చోట నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకముందు పద్మశ్రీ పేరును సినిమాల్లో, మరెక్కడా, కనీసం ఇంటి నేమ్ ప్లేట్ మీద కానీ వాడుకోనని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్ట్ సూచించింది. ఈ కేసు విచారణను 17వతేదికి వాయిదా వేసింది. దేనికైనా రెడీ సినిమా టైటిల్స్ లో మోహన్ బాబు తన పేరు ముందు 'పద్మశ్రీ' పేరును వాడడంతో ఈ వివాదం మొదలైంది. బీజేపి నేత ఇంద్రసేనా రెడ్డి మోహన్ బాబు 'పద్మశ్రీ'ని దుర్వినియోగం చేస్తున్నారని రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు 'పద్మశ్రీ' ని తిరిగి ఇచ్చేయాలని ఆదేశించడంతో మోహన్ బాబు సుప్రీంకోర్ట్ ను ఆశ్రయించారు.


