జయలలిత మృతిపై మరో ట్విస్ట్... ఫొటోలు బయటపెడతా..!


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఇప్పటికే పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పన్నీర్ సెల్వం వర్గం నేతలు అమ్మ మృతిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇన్ని అనుమానాల మధ్య అమ్మ మృతిపై మరో ట్విస్ట్ నెలకొంది. ఈసారి బాంబు పేల్చింది శశికళ మేనల్లుడు జయానంద్‌ దివాకరన్‌. జయలలిత చివరి రోజులకు సంబంధించిన వివరాలు బయటపెడతానని ప్రకటించడంతో కలకలం రేగుతోంది. అపోలో ఆస్పత్రిలో జయలలిత, శశికళకు జరిగిన సంభాషణ వివరాలు, ఫొటోలు వెల్లడిచేస్తానని హెచ్చరించారు. నిజం నిప్పులాంటని, అది ఏనాటికైనా బయటకు వస్తుందని తన ఫేస్‌ బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. ‘ఆస్పత్రిలో ఉండగా జయలలిత ఫొటోలు శశికళ ఎందుకు బయటపెట్టలేదని అడుగుతున్నారు. పచ్చ రంగు గౌన్‌ లో ఆస్పత్రిలో దీనంగా ఉన్న అమ్మను ఆమెను ప్రత్యర్థులకు చూపించడం ఇష్టంలేకే శశికళ ఈ నిర్ణయం తీసుకున్నారు. చనిపోయే వరకు ‘అమ్మ’ సింహంలా బతికింది. ఈ ఇమేజ్‌ కాపాడేందుకు ప్రయత్నించాం. కానీ పన్నీర్‌ సెల్వం అమ్మ శవపేటిక నమూనాతో ఓట్లు అడుక్కున్నారు. నిజం చాలా బలమైంది. అమ్మ, చిన్నమ్మ మాట్లాడుకున్న వీడియోలు ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. పీహెచ్‌ పాండియన్‌, మనోజ్‌ కె పాండియన్‌ లను అప్పుడు మనం ఏం చేయాల’ని దివాకరన్‌ ప్రశ్నించారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో.. దీనిపై ఎంత దుమారం రేగుతుందో చూడాలి.