TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బెంగాల్ లో జంగిల్ రాజ్ అంతం ఖాయం.. సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు

Published on: Mon May 4, 2026 7:49AM

పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభానికి  నిమిషాల ముందు బీజేపీ కీలక నేత, ఆ పార్టీ నందిగ్రామ్ అభ్యర్థి సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు తథ్యమనీ, ప్రజలు బీజేపీ పక్షాన నిలిచారని  ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాకముందే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో  చర్చకు దారితీస్తున్నాయి.  తృణమూల్ కాంగ్రెస్   అగ్రనేత అభిషేక్ బెనర్జీపై సువేందు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫాల్తా నియోజకవర్గంలో రీపోలింగ్‌కు సంబంధించి అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. టీఎంసీ నేతల మాటల్లో అహంకారం కనిపిస్తోందని, ప్రజాస్వామ్యంలో అహంకారానికి తావులేదన్నారు. తమ అరాచక పాలనతో ప్రజలను ఇబ్బంది పెట్టిన వారికి ఈ ఫలితాలు గుణపాఠం చెబుతాయని హెచ్చరించారు.

బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్‌లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను  బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్‌లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా పటిష్టమైన భద్రత నడుమ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఓట్ల లెక్కింపు జరుగుతోంది. నందిగ్రామ్ వంటి కీలక స్థానాల్లో ఫలితం ఎలా ఉండబోతుందనే అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.  ఈ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.