ఆకట్టుకుంటున్న 'సిరివెన్నెల' చివరి పాట!
on Dec 7, 2021
లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. 'సిరివెన్నెల' సినిమాతో లిరిసిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సీతారామశాస్త్రి.. 'సిరివెన్నెల'నే తన ఇంటిపేరుగా మార్చుకొని ఎన్నో అద్భుతమైన పాటలను రచించి.. తెలుగు సినీ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసుకున్నారు. 'సిరివెన్నెల' సినిమాతో మొదలైన ఆయన సినీ ప్రయాణం.. 'సిరివెన్నెల' అనే పాటతోనే ముగియడం విశేషం.
Also Read: బాలయ్య 'అఖండ' సక్సెస్ మీట్ కి మహేష్!
నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'శ్యామ్ సింగరాయ్'. ఈ సినిమాలో సిరివెన్నెల రెండు పాటలు రచించారు. ఆయన రచించిన చివరి పాట 'సిరివెన్నెల'ను తాజాగా మూవీ టీమ్ విడుదల చేసింది. 'సిరివెన్నెల' సాంగ్ ప్రోమో విడుదల సందర్భంగా డైరెక్టర్ రాహుల్ మాట్లాడుతూ ఇది సిరివెన్నెల చివరి పాట అని చెప్పాడు. అనారోగ్యంతో ఉండి కూడా ఈ పాట రాసిన సిరివెన్నెల.. నవంబర్ 4 దీపావళి రోజున ఫోన్ చేసి పాట పల్లవి చెప్పారని అన్నారు. పల్లవిలో 'సిరివెన్నెల' అనే పదం ఉండటం చూసిన రాహుల్.. 'ఈ పాటకి మీ సంతకాన్ని ఎందుకు ఇచ్చారు?' అని అడగగా.. 'ఇదే నా చివరి పాట కావొచ్చు' అంటూ సిరివెన్నెల సరదాగా నవ్వుతూ సమాధానం చెప్పారట. కానీ ఆయన సరదాగా చెప్పిన మాటే నిజమైంది. ఈ పాట ఆయన చివరిపాటగా మిగిలిపోయింది. అందుకే ఈ పాటకు సిరివెన్నెల అనే పేరు పెట్టుకుంది మూవీ టీమ్.
Also Read: 2021 జ్ఞాపకాలుః `బౌన్స్ బ్యాక్` భామలు!
'శ్యామ్ సింగరాయ్' నుంచి సిరివెన్నెల పాట మంగళవారం విడుదలైంది. "నెలరాజునీ.. ఇల రాణినీ.. కలిపింది కదా సిరివెన్నెల" అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం బలం గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన పాటలను అందించిన ఆయన.. వెళ్తూ మరో అద్భుతమైన పాటని అందించి వెళ్లారు. సిరివెన్నెల సాహిత్యం, మిక్కీ జే మేయర్ సంగీతం, అనురాగ్ కులకర్ణి గాత్రం కలయికలో రూపుదిద్దుకున్న ఈ 'సిరివెన్నెల' సాంగ్ ఆకట్టుకుంటోంది.
Also Read