అఫీషియల్.. దర్శకుడిగా తరుణ్ భాస్కర్ మూడో సినిమా
on Jun 23, 2022
'పెళ్లి చూపులు'(2016) సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ దాస్యం మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని సత్తా చాటాడు. ఆ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది?'(2018) సినిమాతోనూ దర్శకుడిగా రెండో విజయాన్ని అందుకున్న తరుణ్.. మూడో సినిమాని మాత్రం ఇన్నాళ్లకు ప్రకటించాడు.
'ఈ నగరానికి ఏమైంది?' తర్వాత నటుడిగా 'ఫలక్నుమా దాస్', 'మీకు మాత్రమే చెప్తా' వంటి సినిమాలలో అలరించాడు. అయితే దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న తరుణ్.. నాలుగేళ్లయినా డైరెక్టర్ గా సినిమా అనౌన్స్ చేయకపోవడంతో ఆయన సినిమాల ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఎందరో ఆయనను మూడో సినిమా గురించి అడుగుతున్నారు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్లుగా ఇన్నాళ్లకు ఈరోజు సాయంత్రం దర్శకుడిగా తన మూడో సినిమాని ప్రకటించాడు తరుణ్.
తరుణ్ దర్శకత్వంలో వస్తున్న మూడో సినిమాకి 'కీడా కోలా' అనే విభిన్న టైటిల్ ను పెట్టారు. క్రైమ్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరించారు. 2023 లో ఈ సినిమా విడుదల కానుంది. త్వరలోనే మిగతా వివరాలను ప్రకటించారు.