'ఉస్తాద్'గా మారిన కీరవాణి తనయుడు శ్రీసింహా
on May 26, 2022
'మత్తు వదలవరా', 'తెల్లవారితే గురువారం' వంటి వైవిధ్యమైన చిత్రాల్లో కథానాయకుడిగా మెప్పించి తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు శ్రీసింహా కోడూరి. ఈ యంగ్ హీరో కొత్త చిత్రం 'ఉస్తాద్' గురువారం హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వారాహి చలన చిత్రం, క్రిషి ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫణి దీప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఉస్తాద్ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, శ్రీవల్లి, నిర్మాత సాయి కొర్రపాటి, కాల భైరవతో పాటు దర్శకులు వెంకటేష్ మహ, శ్రీనివాస్ గవిరెడ్డి, సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు తదితరులు హాజరయ్యారు.
ముహూర్తపు సన్నివేశానికి ఎం.ఎం.కీరవాణి క్లాప్ కొట్టగా ప్రముఖ రచయిత పురాణ పండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. న్యూ ఏజ్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా పవన్ కుమార్ పప్పుల, మ్యూజిక్ డైరెక్టర్ గా అకీవా.బి, ఎడిటర్ గా కార్తీక్ వ్యవహరించనున్నారు. హీరోయిన్ సహా ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలియజేశారు.