శకపురుషుడు ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవారంభ నీరాజనం
on May 27, 2022
తెలుగు చలనచిత్ర రంగంలోనే కాదు, అఖిల భారత చలనచిత్ర రంగంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒరవడిని సృష్టించుకొని, అద్భుతమైన అభినయ కౌశలంతో, భావనాబలంతో ఏ పాత్రనైనా తెరపై వినూత్న రీతిలో ఆవిష్కరించిన మహానటుడు, ప్రయోక్త, ప్రయోగశీలి నందమూరి తారక రామారావు. ఆయన అక్షర శిల్పం, రూప శిల్పం రెండూ తెలిసిన కళాస్రష్ట. అలాంటి మహానటుడి, మహానాయకుడి శత జయంతి ఉత్సవం మే 28న ఆరంభం కానుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది అభిమానులు ఆయనకు నీరాజనాలు అర్పించడానికి అధికోత్సాహంతో సిద్ధమవుతున్నారు.
తారకరాముడు 1923 మే 28న ఇప్పటి కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. మొదట నిమ్మకూరు, తర్వాత విజయవాడ, గుంటూరులో చదువుకున్నారు. ఇంకా టీనేజ్ ముగియకముందే 19 ఏళ్ల వయసులో బసవతారకం గారితో వివాహమైంది. సినిమాల్లోకి రాకముందు 1946 మద్రాస్ సర్వీస్ కమీషన్ పరీక్షలో ఉత్తీర్ణులై 190 రూపాయల జీతానికి ప్రత్తిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహించారు. రెండేళ్లు తిరగక ముందే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, 1949లో 'మనదేశం' సినిమాతో నటుడిగా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత జరిగిందంతా ఒక చరిత్ర.
నిజానికి ఉద్యోగంలో చేరకముందు సినిమాల్లో చేరాలని మద్రాస్ వెళ్లి, అప్పటి లెజెండరీ డైరెక్టర్ ఎల్వీ ప్రసాద్ గారిని కలిశారు ఎన్టీఆర్. 1947 మే 21న ఆయనకు ఎల్వీ ప్రసాద్ స్క్రీన్ టెస్ట్ చేశారు. అలా 'మనదేశం'తో సినీ నటునిగా ఆయన కెరీర్ మొదలైంది. అయితే మొదటి పారితోషికం మూడో సినిమాగా విడుదలైన 'పల్లెటూరి పిల్ల' కి అందుకున్నారు. ఆ చిత్రానికి ఆయనకు లభించిన పారితోషికం అక్షరాలా 1,116 రూపాయలు.
ప్రపంచ సినీ చరిత్రలోనే ఎన్టీఆర్తో సరితూగగల నటుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. కొంతమంది పౌరాణిక పాత్రల్లో రాణిస్తారు, కొంతమంది జానపద పాత్రల్లో రాణిస్తారు, ఇంకొంతమంది సాంఘిక పాత్రల్లో రాణిస్తారు. కానీ ఈ మూడు తరహా పాత్రల్లో అనితరసాధ్యంగా రాణించిన ఏకైక నటుడిగా ఎన్టీఆర్ విశ్వవిఖ్యాతి నార్జించారు. అంతేనా.. నటునిగా ఆయన సాధించినన్ని రికార్డులు అప్పుడే కాదు, ఇప్పటికీ మరే నటునికీ సాధ్యంకాని గొప్ప విశేషం. ఆయన నటించిన 304 సినిమాల్లో 275 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్టయి, నిర్మాతలకు లాభాలు అందించాయంటే చిన్న విషయమా!!
ఇక వాటిలో 23 సినిమాలు సంవత్సరం పాటు ఆడాయి. 94 సినిమాలు 300 రోజులు నడిస్తే, 185 సినిమాలు సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. శత దినోత్సవం జరుపుకున్న సినిమాలు 223. సెకండ్ రిలీజ్లోనూ 28 సినిమాలు 100 డేస్ ఆడాయి. ఇలాంటి రికార్డు మరే నటునికీ లేదు! ఇవే కాదు.. 100 డేస్ ఆడిన సినిమాల విషయంలో ఇంకో ఘనమైన రికార్డు కూడా ఆయన ఖాతాలో ఉంది. 33 సంవత్సరాలు వరుసగా 100 రోజులు ఆడిన సినిమాలు కలిగిన ఏకైక ఇండియన్ హీరో ఎన్టీఆర్. మరే యాక్టర్కీ ఈ రికార్డును అందుకోవడం అసాధ్యమని వేరే చెప్పాల్సిన పనిలేదు.
వెండితెరపై 17 సార్లు శ్రీకృష్ణునిగా నటించి, శ్రీకృష్ణుడంటే నందమూరి తారకరామారావే అన్నంతగా ఆ పాత్రకు ప్రాణం పోశారు. అప్పట్లో క్యాలెండర్ కృష్ణుడు ఆయనే. ఇప్పటికీ అనేక తెలుగిళ్లలో కృష్ణునిగా గోడలపై ఆయన దర్శనమిస్తూనే ఉంటారు.
సంక్రాంతి పండుగకూ, తారకరామునికీ అవినాభావ సంబంధం ఉంది. తన నట జీవితం మొత్తంలో నాలుగేళ్లు మాత్రమే సంక్రాంతికి ఆయన సినిమాలు రిలీజ్ కాలేదు. 32 సినిమాలు సంక్రాంతికి విడుదల కాగా, వాటిలో 27 సినిమాలు అఖండ విజయం సాధించి, ఆయనను సంక్రాంతి రాముడిని చేశాయి. అత్యధిక మల్టీస్టారర్ సినిమాల్లో నటించి, వాటిలో 100 రోజులు ఆడిన సినిమాలు ఎక్కువగా ఉన్న కథానాయకుడు కూడా ఎన్టీఆరే. అక్కినేని నాగేశ్వరరావుతో ఆయన కాంబినేషన్ ఒక చరిత్ర సృష్టించింది. ఆ ఇద్దరూ కలిసి 14 సినిమాల్లో నటిస్తే, వాటిలో 9 శత దినోత్సవం జరుపుకున్నాయి.
నటునిగా అనేక అవార్డులు అందుకున్నారు తారకరామారావు. భారత రాష్ట్రపతి నుంచి 1954, 1963 సంవత్సరాల్లో ఉత్తమ నటుని పురస్కారం అందుకున్న ఆయన 1954, 1960, 1968 సంవత్సరాల్లో నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డులను పొందారు. 1974లో ఉత్తమ నటునిగా నంది అవార్డు అందుకున్నారు. ఇక భారత ప్రభుత్వం ఇచ్చే పౌర పురస్కారాల్లో పద్మశ్రీని 1968లోనే అందుకున్నారు ఎన్టీఆర్. 1978లో ఆంధ్రా యూనివర్సిటీ ఆ నటసార్వభౌముడికి గౌరవ డాక్టరేట్ అందజేసి తనను తాను గౌరవించుకుంది.
మరణానంతరం కూడా ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్ఠలు ఏమాత్రం తగ్గలేదు. భారతీయ సినిమా 100 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా 2013లో సీఎన్ఎన్-ఐబీఎన్ నిర్వహించిన సర్వే ప్రకారం భారతదేశ ప్రఖ్యాత నటుడిగా 53 శాతం ఓట్లతో ఎన్టీఆర్ మొదటి స్థానంలో నిలవడం గొప్ప విషయం. అలాగే ఎన్డీటీవీ సర్వేలో ప్రఖ్యాత ఆంధ్రుడిగా 73 శాతం ఓట్లు పొంది ప్రథమ స్థానంలో నిలిచిన విఖ్యాతులు రామారావు.
ఎన్టీఆర్ది గొప్ప సేవాగుణం. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సాయాలు చేశారు. వాటిలో గుప్త దానాలే అధికం. నిజానికి చదువుకునే రోజుల్లోనే వీధి నాటకాల ద్వారా పేదలకు, కరువు ప్రాంతాల ప్రజానీకం కోసం విరాళాలు సేకరించిన మానవతామూర్తి తారకరాముడు. ఆ తర్వాత హీరోగా విరామం లేకుండా నటిస్తున్న రోజుల్లో 1952లో రాయలసీమ క్షామం వచ్చినప్పుడు, ప్రజాక్షేమం ఆలోచించి స్వయంగా జోలిపట్టి చందాలు సేకరించి, రాయలసీమ వాసులకు సాయం అందించిన ప్రజల మనిషి ఎన్టీఆర్. శత జయంతి ఆరంభం అవుతున్న సందర్భంగా ఆయనకు తెలుగువన్ జోహార్లు తెలియజేస్తోంది.
Also Read