మారుతి మొదటి సినిమా 'ఈరోజుల్లో' కాదు!
on Jun 28, 2022
'ఈరోజుల్లో'(2012) సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మారుతి వరుస సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. అయితే అందరూ మారుతి ఫస్ట్ ఫిల్మ్ 'ఈరోజుల్లో' అనుకుంటారని, కానీ నిజానికి ఆయన ఫస్ట్ ఫిల్మ్ 'బస్ స్టాప్' అని తాజాగా ప్రొడ్యూసర్ బన్నీ వాసు రివీల్ చేశాడు.
గోపీచంద్, రాశి ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'పక్కా కమర్షియల్'. యూవీ క్రియేషన్స్ తో కలిసి జీఏ2 పిక్చర్స్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా జులై 1 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మారుతి, బన్నీ వాసు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ తాను చిన్న, పెద్ద అని లెక్కలేసుకొని సినిమాలు చేయనని.. అవకాశాలను అందిపుచ్చుకొని అన్ని రకాల సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తానని అన్నాడు. ఈ క్రమంలో బన్నీ వాసు ఓ ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేశాడు.
బన్నీ వాసు మాట్లాడుతూ.. "లైఫ్ లో మారుతి దగ్గర నుంచి ఒక విషయం నేర్చుకున్నాను. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మారుతి ఫస్ట్ సినిమా ఈరోజుల్లో కాదు బస్టాప్. బస్టాప్ సినిమాని 30-40 శాతం షూట్ చేసి నాకు చూపించాడు. మేం ఏదైనా అనుకుంటే అదెలా ఇదెలా అని వంద లెక్కలేస్తాం. కానీ మారుతి బుర్రలోకి ఒక ఐడియా వచ్చిందంటే నిద్రపోడు. వేరే వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారని ఆలోచించడు. ఫస్ట్ వెళ్లి కెమెరా పెట్టేస్తాడు. అలా బస్టాప్ తీశాడు.. కానీ నేను కంగారు పడకు అంటూ ఆపుతూ వచ్చాను. ఇద్దరం ఒకసారి అబ్రాడ్ వెళ్ళాం.. వస్తూ వస్తూ అప్పుడే కొత్తగా వచ్చిన 5D కెమెరా కొనుక్కొని వచ్చాము. అయితే ఫ్లైట్ లో వచ్చేటప్పుడు మాములుగా ఒక కథ చెప్పాడు. వచ్చిన వెంటనే ఆ 5D కెమెరాతో షూట్ స్టార్ట్ చేశాడు. ఈ సినిమాతో నిర్మాతలకు 80 లక్షలో కోటి రూపాయలో మారుతి పోగొడతాడు అనుకున్నా. అదే 'ఈరోజుల్లో' సినిమా. మారుతి అంత ధైర్యంగా, అంత స్పీడ్ గా ఉంటాడు కాబట్టే ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాడు. ఒక ఆలోచన వస్తే దానిని తీసేవరకు నిద్రపోడు. అదే అతని సక్సెస్ " అంటూ చెప్పుకొచ్చాడు.