ఇటు సినిమాలు.. అటు రాజకీయాలు.. రెండింటిలోనూ దూకుడు పెంచిన పవర్స్టార్!
on Sep 28, 2021
జనసేనాని పవన్ కల్యాణ్ కెమెరా ముందు దూసుకుపోతున్నారు. రెండేళ్లకు పైగా సినిమాలకు విరామమిచ్చి, 'వకీల్ సాబ్'తో ఈ ఏడాది ఏప్రిల్లో జనం ముందుకు వచ్చి అలరించిన ఆయన వచ్చే జనవరిలో 'భీమ్లా నాయక్'గా పలకరించబోతున్నారు. దాని తర్వాత 'హరిహర వీరమల్లు'గా 2022 వేసవిలో రానున్నారు. సినిమాల విషయంలో ఆయన స్పీడు అభిమానుల్ని ఆనందడోలికల్లో ముంచెత్తుతోంది. తమ ఆరాధ్య హీరో మళ్లీ అసలు సిసలు పవర్స్టార్గా విజృంభిస్తున్నాడని వారంతా సంబరపడుతున్నారు.
మరోవైపు జనసైనికులను కూడా కల్యాణ్ నిరుత్సాహపర్చడం లేదు. ఇటీవల పరిషత్తు ఎన్నికల్లో ఫర్వాలేదనిపించే స్థాయిలో సీట్లను, ఓట్ల శాతాన్ని సంపాదించుకున్న జనసేన తరపున పోటీచేసి గెలుపొందిన అభ్యర్థులతో పాటు అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన వారందరినీ ఆయన అభినందించారు. పనిలో పనిగా ఆ ఎన్నికల్లో అధికార బలం ఉపయోగించి వైసీపీ దౌర్జన్యాలకు, దాష్టీకాలకు పాల్పడిందనీ ఆయన ఆరోపించారు. అంతటితో ఆగలేదు. తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ ఫిల్మ్ 'రిపబ్లిక్' ప్రి రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా వచ్చిన ఆయన మరోసారి వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడారు. అయితే అక్కడ రాజకీయ అంశాలను కాకుండా సినిమాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న ధోరణిని ఎండగట్టారు.
ఆన్లైన్ విధానం ద్వారా సినిమా టికెట్లను అమ్మాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తనపై కోపంతో సినిమాను చంపేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇండస్ట్రీ జోలికొస్తే కాలిపోతారంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆన్లైన్ టికెట్ల ఆదాయం చూపి అప్పులు తెచ్చుకోడానికే అలా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రైవేటు వ్యక్తులు తీసే సినిమాపై ప్రభుత్వ ఆధిపత్యం ఏమిటని ప్రశ్నించారు. ‘సన్నాసి మంత్రి’ అంటూ పేర్ని నానిపై విరుచుకుపడ్డారు.
లేటెస్ట్గా ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై, ఆ పార్టీ నాయకులపై ఆయన చేస్తున్న కామెంట్లు కాకరేపుతున్నాయి. 'రిపబ్లిక్' మూవీ ఈవెంట్లో తను చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఇచ్చిన కౌంటర్కు ప్రతిస్పందనగా, "తుమ్మెదల ఝుంకారాలు.. నెమళ్ళ క్రేంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే…" అని ఆయన ట్వీట్ చేయడం రాజకీయంగా ఆయన దూకుడు పెంచారని తెలియజేస్తోంది. మనసులో అనుకున్న దానిని బాహాటంగా వ్యక్తం చేయడానికి ఇప్పుడాయన వెనుకాడటం లేదు. తనది ఆచితూచి మాట్లాడే పద్ధతి కాదని ఆయన తన చర్యల ద్వారా, మాటల ద్వారా తెలుపుతున్నారు.
ఈరోజు ఉదయం ఆయన, "వైసీపీ ప్రభుత్వం 'పాలసీ ఉగ్రవాదం' కి అన్నీ రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది.." అంటూ మరో ట్వీట్ చేశారు. వైసీపీని ఎదుర్కోవడానికి ఆయన దుందుడుకుగా వ్యవహరిస్తుండటం చూసి జనసైనికుల్లోనూ ఉత్సాహం ఎక్కువవుతోంది. తమ అధినాయకుడిలో ఇటీవల వచ్చిన ఈ మార్పు తమ పార్టీ బలం పుంజుకోవడానికి దోహదం చేస్తుందని వారు ఆశిస్తున్నారు. పవర్స్టార్గా సినిమా ఇండస్ట్రీలో వెలుగుతున్న ఆయన జనసేనానిగా రాజకీయ రంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేయబోతున్నాడని వారు భావిస్తున్నారు. ఇలా ఆయన అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో దూకుడుగా వ్యవహరిస్తూ అభిమానుల్లో ఉత్సాహం, ఉత్తేజం నింపుతున్నారు.
Also Read