చిరంజీవి బృందానికి సీఎం జగన్ నుంచి పిలుపు
on Sep 14, 2021
తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఏపీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్ళాలని ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి బృందానికి పిలుపు వచ్చింది. చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్రముఖులు ఈ నెల 20న వైఎస్ జగన్ ని కలవనున్నారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
కరోనా నేపథ్యంలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువస్తామని చిరంజీవి నేతృత్వంలోని బృందం ఇంతకుముందు ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ద్వారా కబురుపంపింది. పేర్ని నాని ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించిన ఆయన ఈ నెల 20న అపాయింట్మెంట్ ఇచ్చారు. పేర్ని నాని నుంచి సమాచారం అందడంతో 20న సీఎంను కలిసేందుకు చిరంజీవి నేతృత్వంలోని బృందం రెడీ అవుతోంది.
సీఎం జగన్ను కలవనున్న చిరంజీవి బృందంలో అక్కినేని నాగార్జున, దిల్ రాజు, సురేష్ బాబు తదితరులు ఉన్నారు. కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలు వేసే అవకాశం ఇవ్వాలనీ.. నగరాలు, పట్టణాల్లో రోజుకు నాలుగు షోలు ప్రదర్శించే వెసులుబాటు కల్పించాలనీ.. అదే విధంగా గ్రేడ్-2 కేంద్రాల్లో నేల టిక్కెట్టుకు పది రూపాయలు, కుర్చీకి 20 రూపాయలు వసూలు చేసే విధానాన్ని రాష్ట్రమంతా వర్తింపజేయవద్దని సీఎం జగన్ ను చిరంజీవి బృందం కోరనుందని సమాచారం. అలాగే, సినిమా టికెట్లను ప్రభుత్వమే విక్రయించాలని నిర్ణయించడంపైనా చిరంజీవి బృందం సీఎంతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read