సినిమా టికెట్ ధరలపై 'మేజర్' టర్న్
on May 27, 2022
అధిక టికెట్ ధరలు కారణంగా సాధారణ ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇది సినిమా కల్లెక్షన్లపై ప్రభావం పడుతుండటంతో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ దిగొస్తున్నారు. తాజాగా విడుదలైన 'F3' సినిమా ప్రభుత్వం నిర్ణయించిన సాధారణ టికెట్ ధరలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పేరుకి అదనపు ఛార్జ్ వసూలు చేయనప్పటికీ.. హైదరాబాద్ లో ఈ సినిమా టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్స్ లో రూ.200, మల్టీప్లెక్స్ లలో రూ.300 ఉన్నాయి. ఇవి కూడా ఎక్కువని ప్రేక్షకులు ఫీల్ అవుతున్న టైంలో 'మేజర్' టీమ్ సంచలన నిర్ణయం తీసుకుంది.
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ 'మేజర్'. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి శశి కిరణ్ తిక్క దర్శకుడు. జూన్ 3న విడుదలవుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాని ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా అందుబాటు ధరల్లో రిలీజ్ చేస్తున్నారు. జీఎస్టీతో కలిపి తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ లో రూ.150, మల్టీప్లెక్స్ లలో రూ.195.. ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ స్క్రీన్స్ లో రూ.147, మల్టీప్లెక్స్ లలో రూ.177 గా ధరలు నిర్ణయించారు. ఈ నిర్ణయం సినీ ప్రేమికులను, ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సోనీ పిక్చర్స్, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
