బ్లాక్ లో టికెట్లు అమ్ముతూ పట్టుబడ్డ స్టార్ కమెడియన్!
on Jun 29, 2022
ఒకప్పుడు స్టార్ హీరో సినిమా వచ్చిందంటే చాలు థియేటర్స్ ముందు బ్లాక్ టికెట్స్ అమ్ముతూ కొందరు దర్శనమిచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత బ్లాక్ టికెట్ల అమ్మకం తగ్గిపోయింది. అయితే తాజాగా కమెడియన్ సప్తగిరి బ్లాక్ లో టికెట్లు అమ్ముతూ దొరికిపోయాడు. ఆయనకు సినిమా అవకాశాలు బాగానే ఉన్నాయిగా, మళ్ళీ ఈ వ్యాపారం ఎందుకు అనుకుంటున్నారా?. అదంతా ఓ సినిమా ప్రమోషన్ కోసం లేండి.
గోపీచంద్, రాశి ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'పక్కా కమర్షియల్'. ఈ సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మధ్య అధిక టికెట్ ధరల కారణంగా ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం తగ్గించారు. ఈ క్రమంలో తమ సినిమాని సాధారణ టికెట్ ధరలతోనే విడుదల చేస్తున్నామని తెలపడం కోసం ఓ ప్రమోషన్ వీడియోని విడుదల చేసింది మూవీ టీమ్. అందులో బ్లాక్ టికెట్లు అమ్మే వ్యక్తిగా కనిపించాడు సప్తగిరి.
థియేటర్ వద్ద సప్తగిరి బ్లాక్ టికెట్స్ అమ్ముతుంటగా అతన్ని మూవీ టీమ్ పట్టుకొని డైరెక్టర్ మారుతి దగ్గరకు తీసుకెళ్తారు. "తాను సినిమాల్లోకి రాకముందు మెగాస్టార్ సినిమా టికెట్స్ బ్లాక్ లో రూ.150 కి అమ్మేవాడిని" అని సప్తగిరి చెప్పడంతో.. ''పక్కా కమర్షియల్ టికెట్స్ ఇంతకు అమ్ముతున్నావు?" అని మారుతి అడుగుతాడు. "150 కి" అని సప్తగిరి చెప్పగా.. "కౌంటర్ లో కూడా అదే రేట్ కదా" అని మారుతి అనడంతో సప్తగిరి షాక్ అవుతాడు. "అంటే పాత రేట్లకే ఇస్తున్నారా!.. నేనింకా ఒక్కో టికెట్ రూ.300-400 అనుకున్నా" అంటాడు. "లేదు, ప్రేక్షకులకు అందుబాటు ధరలోనే మా సినిమా రానుంది" అని మారుతి చెప్తాడు. అలాగే "అయినా నీకు లెక్కలు రావా ఏంటి?.. కౌంటర్ లో రూ.300-400 ఉంటే ఇంకా ఎక్కువకి అమ్మాలి గాని 150 కి అమ్మడం ఏంటి" అంటూ మారుతి లాజిక్ మాట్లాడటంతో సప్తగిరి అమాయకంగా తల గోక్కున్నాడు.